నూజివీడు : దసరా సందర్భంగా నూజివీడు స్పోర్టింVŠ Sక్లబ్ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న 65వ వార్షిక అఖిల భారత పురుషుల చెడుగుడు, మహిళల కబడ్డీ పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగుతున్నాయి. మహిళల కబడ్డీ పోటీల్లో విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, అనంతపురం జట్లు పాల్గొంటున్నాయి. స్థానిక ఎస్ఆర్ఆర్ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన బీచ్ కబడ్డీ, కబడ్డీ కోర్టులలో మంగళవారం, బుధవారం సాయంత్రం 7 నుంచి రాత్రి 10గంటల వరకు ఈ జట్ల మధ్య లీగ్ మ్యాచ్లు జరిగాయి. విశాఖపట్నం జట్టు అన్ని లీగ్ మ్యాచ్లలో గెలుపొంది అగ్రస్థానంలో కొనసాగుతోంది. విజయనగరం, కృష్ణా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. చివరకు విజయనగరం జట్టు విజయం సాధించింది. రెఫరీలుగా కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర ప్రతినిధులు పీఎస్ సుధాకర్, సీహెచ్ శ్రీనివాస్, పి.శ్రీనివాసరావు, పీఎస్ఎన్ మల్లేశ్వరరావు, బి.శంకర్, ఇ.రామకృష్ణ, ఎం.మధు వ్యవహరించారు. స్పోర్టింగ్ క్లబ్ అధ్యక్షుడు బొబ్బిలి కొండలరావు, ప్రధాన కార్యదర్శి తిరుమలశెట్టి వెంకట కృష్ణారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.