'సీమ సమస్యలపై ఉద్యమిస్తాం'

30 Aug, 2015 21:59 IST|Sakshi

కడప కల్చరల్ : రాయలసీమ ఇప్పటికే అనేకమార్లు పలువురి వంచనకు గురై తీవ్రంగా నష్టపోయిందని, నేటికీ ఆ మోసం పునరావృతమవుతోందని, ఇకనైనా 'సీమ' సమస్యలపై తీవ్రంగా ఉద్యమించకపోతే మరింత నష్టపోవాల్సి ఉంటుందని కదలిక పత్రికా సంపాదకులు ఇమాం హెచ్చరించారు. ఆదివారం వైఎస్సార్ జిల్లా కడప నగరంలోని సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రంలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఎన్.శివరామిరెడ్డి రచించిన 'ది స్టోరీస్ ఆఫ్ 13 జెమ్స్ ఆఫ్ ది నేషన్' పుస్తకావిష్కరణ సభకు ఆయన అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిన్నటి గాలేరు - నగరితోపాటు ఇతర ప్రాజెక్టుల విషయంలో, నేడు ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రంతోపాటు సీమకు ప్రత్యేకించి ప్రస్తుత నాయకులు నష్టం చేకూరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీమకు ప్రాజెక్టులు దక్కకుండా తాగునీటికి సైతం ముఖం వాచేలా కుట్ర చేస్తున్నారని చెప్పారు. ఇకనైనా సీమ నాయకులు, ఉద్యమకారులు, విద్యార్థులు, మేధావులు మేల్కొని తీవ్ర స్థాయిలో ఉద్యమించకపోతే ఇక తేరుకునే ప్రసక్తే ఉండదన్నారు.

మరిన్ని వార్తలు