విహార యాత్ర మృతుల్లో తెలుగమ్మాయి

3 Feb, 2016 06:56 IST|Sakshi
విహార యాత్ర మృతుల్లో తెలుగమ్మాయి

సాక్షి ప్రతినిధి, కడప: మహారాష్ట్రలో విహార యాత్రకు వెళ్లి మృత్యువాత పడిన 14 మంది విద్యార్థుల్లో ఓ తెలుగమ్మాయి ఉంది. వైఎస్‌ఆర్ కడప జిల్లా చెన్నూరుకు చెందిన పండుగాయల వెంకటరమణయ్య(50) కొన్నేళ్ల కిందట తల్లితో కలసి పుణేకు వెళ్లి స్థిరపడ్డాడు. ఏడాది కిందట ఈయన మృతి చెందాడు. ఇతని కుమార్తె రాజ్యలక్ష్మి(21) అలియాస్ స్వాతి పుణేలోని ఓ కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్స్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. సోమవారం రాయగఢ్‌కు సమీపంలోని అరేబియా సముద్రంలో దిగి అలల ఉధృతికి కొట్టుకుపోయి మృతి చెందిన వారిలో ఈమె కూడా ఉన్నట్లు చెన్నూరులో ఉంటున్న ఆమె తాత పండుగాయల రామకృష్ణయ్య తెలిపారు.

సెల్ఫీ మోజు వల్లే..
రాయ్‌గఢ్ జిల్లా మురూడ్-జంజీరా తీరంలో సముద్రంలో మునిగి 14 మంది మరణించడానికి కారణం సెల్ఫీలేనని తెలుస్తోంది. అందరు కలసి సముద్రంలోకి దిగి ఫొటోలు దిగుతుండగా ఒక్కసారిగా ఉవ్వెత్తున కెరటం ఎగసిపడటంతో సముద్రంలోకి కొట్టుకుపోయారని, ప్రాణాలతో బయటపడిన కొందరు విద్యార్థులు చెబుతున్నారు. సోమవారం రాత్రి 8 గంటలవరకు హెలీకాప్టర్లు, కోస్టల్‌గార్డు నౌకలతో చేపట్టిన గాలింపు చర్యల్లో 13 మంది మృతదేహాలు లభించగా, మంగళవారం ఉదయం మరో మృతదేహం లభించింది.

>
మరిన్ని వార్తలు