ఫ్యాక‌్షన్‌ను పోషిస్తున్న బాబు

29 May, 2017 00:13 IST|Sakshi

నారాయణరెడ్డి హత్యను సీబీఐతో విచారణ జరిపించాలి
మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి


గుమ్మఘట్ట : రాష్ట్రంలో ఆటవిక, నియంతృత్వ పాలన సాగుతోందని రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. రోజురోజుకూ ప్రజాదరణ చూరగొంటున్న వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీని అణిచివేయాలనే లక్ష్యంతోనే సీఎం చంద్రబాబు ఫ్యాక్షన్‌ను పెంచిపోషిస్తున్నాడని ఆయన మండిపడ్డారు. ఆదివారం ఆయన గుమ్మఘట్టలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చిననాటి నుంచి 500ల మంది వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారని, ఈ రాక్షస రాజ్యానికి ప్రజలే బుద్ధిచెప్పాలన్నారు.

ఇటీవల కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నారాయణరెడ్డి హత్య కేసును సీబీఐతో విచారణ జరిపిస్తే అసలు నిందితులు బయటకొస్తారని, ఈ విషయంలో గవర్నర్, కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అక్రమ కేసులతో తమ నాయకులు, కార్యకర్తలను బెదిరించాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. రాయదుర్గం నియోజక వర్గ వ్యాప్తంగా ఇసుక మాఫీయా పెట్రేగిపోతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నీరు–చెట్టులో జరిగిన దోపిడీ పై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు