హర్షకుమార్‌ ! పిచ్చి మాటలు తగ్గించుకో

12 Dec, 2016 14:48 IST|Sakshi
హర్షకుమార్‌ ! పిచ్చి మాటలు తగ్గించుకో
కారెం శివాజీ
కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : దళిత వ్యతిరేకి అయిన అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌ పిచ్చిమాటలు తగ్గించుకోవాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ కారెం శివాజీ అన్నారు. లాలాచెరువు వద్ద గల దళిత, గిరిజన మహాగర్జన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాగర్జనకు దళిత, గిరిజనులను రాకుండా చేయడానికి హర్షకుమార్‌ విశ్వప్రయత్నాలు చేశారని ఆరోపించారు. పాతనోట్ల రద్దు ప్రభావం దేశ వ్యాప్తంగా ఉన్నా ఆర్థిక ఇబ్బందులను అధిగమించి దళిత, గిరిజన మహా గర్జన సభను విజయవంతం చేశారని శివాజీ అన్నారు. మహాగర్జన వల్ల ఎన్నో సమస్యలకు పరిష్కారం లభించిందన్నారు. క్రైస్తవులకు సమాధుల స్థలం, బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ, రెండు వారధుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో పాటు గోదావరి నదీ తీరాన బుద్ధ విహార్‌ నిర్మాణానికి సీఎం అంగీకరించారని శివాజీ వివరించారు. గర్జనకు వచ్చిన ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, దళిత నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. దళిత, గిరిజన మహాగర్జన కన్వీనర్‌ అజ్జరపు శ్రీనివాస్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ధనరాశి శ్యామ్‌సుందర్, నాయకులు తాళ్లూరి బాబూరాజేంద్రప్రసాద్, కోరుకొండ చిరంజీవి, నీలాపు వెంకటేశ్వరరావు  పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు