నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో కరువును ఎలా ఎదుర్కోవాలో ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా సీఎం మాట్లాడుతూ కరువు నివారణకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు తెలిపారు.
వడదెబ్బ తగలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణను ప్రధాని మోదీతో పాటూ కేంద్రమంత్రులు ప్రశంసించారని తెలిపారు. నిధులను సద్వినియోగం చేసుకుని ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసుకోవాలని సూచించారు. అధికారుల ప్రవర్తన హుందాగా ఉండాలని కలెక్టర్లకు చెప్పినట్టు తెలిపారు. ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులపై జులుం మంచిదికాదని తెలిపారు.