ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్న కేసీఆర్‌

5 Aug, 2016 21:44 IST|Sakshi
ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్న కేసీఆర్‌
  • చట్టప్రకారం భూసేకరణ చేపట్టాలి
  • ప్రశ్నిస్తే లాఠీచార్జి చేస్తారా?
  • బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి
  • హుస్నాబాద్‌రూరల్‌ : బతుకులు బాగుపడతాయని, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారనిబీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు మద్దతుగా శుక్రవారం రైతు భరోసాయాత్ర చేపట్టారు. ముంపుప్రాంతాలను పరిశీలించారు. రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలను న్యాయాస్థానాలు తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడైన భూనిర్వాసితులను ఆదుకునేందుకు 2013 భూసేకరణ చట్టం ఉందని గుర్తు చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం బోగస్‌ జీవో 123ను తెచ్చి రైతుల నుంచి భూములు లాక్కోవాలని చూసిందన్నారు. 123 జీవోపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరపడ్డాయన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి నోటిఫికేషన్‌ ఇచ్చిన ఐదేళ్లలోపు పరిహారం పూర్తిగా చెల్లించకపోతే రీనోటిఫికేషన్‌ వేసి కొత్త చట్టం ప్రకారం చెల్లించాల్సి ఉంటుందని గుర్తు చేశారు. అయితే గౌరవెల్లి, గండిపెల్లి రిజర్వాయర్ల నోటిఫికేషన్‌ ఇచ్చి ఏడేళ్లు గడుస్తున్నా పరిహారం పూర్తిగా చెల్లించకపోవడంతో రీనోటిఫికేషన్‌ వేయాలన్నారు. దీనిపై కోర్టుకు వెళ్లి రైతులకు న్యాయం చేసేందుకు బీజేపీ పోరాడుతుందన్నారు. కేంద్రం పేదల కోసం 90 వేల గహాలు మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కనీసం వెయ్యి ఇళ్లు కూడా నిర్మించలేదన్నారు. సర్పంచులు వివేకానంద్, యాదమ్మసంపత్, బీజేపీ రాష్ట్ర నాయకుడు నారాయణరావు, జిల్లా ఉపాధ్యక్షురాలు లక్కిరెడ్డి తిరుమల, సాయిని మల్లేశం, మండలాధ్యక్షుడు నాగిరెడ్డి జయపాల్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అనిల్,నాయకులు శ్యాంసుందర్‌రెడ్డి,భగవాన్‌రెడ్డి,వేణుగోపాల్‌రెడ్డి,వేణుగోపాల్‌రావు,మనోహర్‌రావు, కిషన్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, కర్ర సంజీవ్‌రెడ్డి, లింగారెడ్డి, శంకర్, సతీష్, భూనిర్వాసితులు దొడ్ల మల్లారెడ్డి, రమేశ్‌రెడ్డి, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.  
     
     
మరిన్ని వార్తలు