-
అనంతపురం సప్తగిరిసర్కిల్: దక్షిణ భారత సబ్–జూనియర్ ఫుట్బాల్ పోటీల్లో ఆంధ్రజట్టుపై కేరళ 9–1 తేడాతో ఘన విజయం సాధించి నాకౌట్ చేరింది. శుక్రవారం స్థానిక అనంత క్రీడా గ్రామంలో జరిగిన మ్యాచ్లో కేరళ, ఆంధ్ర జట్లు తలపడ్డాయి. కేరళ జట్టు ఆరంభం నుంచే ఆధిపత్యం కొనసాగించింది. మొదటి హాఫ్టైంలో 5–0, రెండో హాఫ్టైంలో 4 - 1 తేడాతో దూసుకెళ్లింది. కాగా రెండో హాఫ్టైంలో ఆంధ్ర క్రీడాకారుడు మధుబాబు గోల్ చేశాడు.
ఆర్డీటీ కృషి ప్రశంసనీయం : ఎల్వీ సుబ్రహ్మణ్యం
జిల్లాలో క్రీడాభివృద్ధికి ఆర్డీటీ సంస్థ చేస్తున్న కృషి ప్రశంసనీయమని రాష్ట్ర ప్రభుత్వ స్పోర్ట్స్ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. జాతీయస్థాయి ఫుట్బాల్ టోర్నీ ముగింపు కార్యక్రమానికి సుబ్రమణ్యంతో పాటు ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. టోర్నీలో కేరళ, కర్ణాటక జట్లు నాకౌట్ స్థాయికి అర్హత సాధించాయని ఆంధ్ర ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపాలకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ నిర్మల్కుమార్, జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి నాగరాజు, ఉపాధ్యక్షుడు వేణుగోపాల్, కోశాధికారి భాస్కర్రెడ్డి, ఆర్డీటీ మేనేజర్ సురేంద్ర, వైద్యుడు సయ్యద్ హుస్సేన్, కోచ్లు దాదాఖలందర్, రియాజ్, మనురావు తదితరులు పాల్గొన్నారు.