నాణ్యమైన విద్యనందించేందుకే కేజీ టు పీజీ

21 Sep, 2016 22:54 IST|Sakshi
నాణ్యమైన విద్యనందించేందుకే కేజీ టు పీజీ
నకిరేకల్‌ : పేదవర్గాల వారికి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకొస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్యను ప్రవేశపెట్టారని.. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 350 గురుకుల పాఠశాలలను మంజూరు చేశారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. నకిరేకల్‌లో రూ.2.25కోట్లతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవనాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం జెడ్పీహైస్కూల్‌లో రూ.52లక్షలతో అదనపు గదుల భవన సముదాయానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మెయిన్‌ సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో కడియం శ్రీహరి మాట్లాడారు. తాజాగా బీసీ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌తో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్‌ ప్రతి నియోజకవర్గానికి ఒక బీసీ రెసిడెన్షియల్‌ గురుకులాన్ని కేటాయిస్తూ మొత్తం 119 గురుకుల పాఠశాలలను మంజూరు చే శారన్నారు.  
జానారెడ్డిపై నిప్పులు చెరిగిన మంత్రి జగదీశ్‌రెడ్డి  
రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో ఈ జిల్లాకు చెందిన ప్రతిపక్ష నేత జానారెడ్డిపై నిప్పులు చెరిగారు. 30ఏళ్లుగా ఈ జిల్లా జానారెడ్డి పాలనలో ఉందని.. కనీసం ఆయన నియోజకవర్గానికి రెండు రెసిడెన్షియల్‌ పాఠశాలలు కూడా మంజూరు చేయించలేదని విమర్శించారు. ఎమ్మెల్యే వేముల వీరేశం అధ్యక్షతన జరిగిన ఈ సభలో జెడ్పీచై ర్మన్‌ బాలునాయక్, ఎమ్మెల్సీ పూల రవీందర్, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, నార్కట్‌పల్లి ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ మొగిలి సుజాత, అల్గుబెల్లి అమరేందర్‌రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, పూజర్ల శంభయ్య, పల్‌రెడ్డి నర్సింహారెడ్డి, వీర్లపాటి రమేష్, సోమ యాదగిరి, సిలివేరు ప్రభాకర్, మంగినపల్లిరాజు తదితరులు ఉన్నారు. 
 
మరిన్ని వార్తలు