దమ్ము చక్రాలతో దుమ్ము లేస్తున్న రోడ్లు

28 Jul, 2016 23:14 IST|Sakshi
ఎలకుర్తి శివారులో రోడ్డుపై వెళుతున్న కేజీవీల్స్‌ ట్రాక్టర్‌
  • తేలుతున్న కంకర.. గోతులమయంగా రహదారులు
  • గుంతల్లో నిలుస్తున్న నీరు.. ప్రభుత్వ నిబంధనలు బేఖాతర్‌
  • పట్టించుకోని అధికారులు
  • టేక్మాల్‌ : దమ్ము చక్రాలతో రోడ్లన్నీ దుమ్ములేస్తున్నాయి. ఒక ట్రాక్టర్‌ వెనుక మరొకటి వెళుతుండడంతో రోడ్లపై ఏకంగా చిన్నాపాటి కాలువల్లా గోతులు ఏర్పడుతున్నాయి. వాటిపై వెళుతున్న వాహనదారులు అదుపుతప్పి పడుతూ నానా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై దమ్ము చక్రాలతో వాహనాలను నడపవద్దని ప్రభుత్వం నిబంధనలు విధించినప్పటికీ పట్టించుకోకుండానే తమ ఇష్టారాజ్యంగా నడుపుతున్నారు. దీంతో గ్రామీణ రోడ్ల పరిస్థితి దయనీయంగా తయారవుతోంది.

    అదే రోడ్లపై వాహనదారుల, ప్రయాణికుల ప్రాణాల మీదకు వస్తోంది. మండలంలోని టేక్మాల్‌ చౌరస్తా నుంచి ఎలకుర్తి, శేర్‌పల్లి ఎల్లుపేట, కమ్మరిత్త, బొడగట్, కుసంగి నుంచి దనూర, కోరంపల్లి రోడ్లు, టేక్మాల్‌ నుంచి అచ్చన్నపల్లి వరకు గల గ్రామీణ రోడ్లపై అధికంగా దమ్ము చక్రాలున్న వాహనాలను యథేచ్ఛగా నడుపుతున్నారు. అంతేకాకుండా ప్రధాన రహదారులైనా మెదక్‌–బొడ్మట్‌పల్లి, జోగిపేట–నారాయణఖేడ్‌ రోడ్లపై దమ్ము చక్రాల వాహనాలు నిత్యం తిరుగుతున్నాయి.

    దీంతో రోడ్లపై గీతలు పడుతూ కోసుకుపోతున్నాయి. రోడ్లపై కంకర తేలి గోతులు పడుతున్నాయి. గోతులలో వర్షపు నీరు నిలుస్తోంది. దీంతో గుంతల్లోని లోతు తెలియకపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్లపై  రాత్రి వేళల్లో ప్రయాణించాలంటే ప్రజలు జంకుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొందని తీవ్రభయాందోళన చెందుతున్నారు. అయినా సంబంధిత అధికారులు స్పందించకపోవడంతో వారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

    ప్రభుత్వ నిబంధనలివీ..

    • దమ్ము చక్రాలు లేదా ఇనుప చక్రాలు బిగించిన ట్రాక్టర్లు తారు రోడ్డు మీద తిరగడం వల్ల ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న రహదారులు అనతి కాలంలో పాడవుతున్నాయి.
    • దమ్ము చక్రాలు బిగించిన ట్రాక్టర్లు తారు రోడ్లపై తిరగడాన్ని ప్రభుత్వం నిషేధించింది.  
    • రహదారులు, భవనాలశాఖ సిబ్బంది, పోలీసు, రెవెన్యూ, జిల్లా ట్రా¯Œ్సపోర్టు అథారిటీ సిబ్బంది వీటిపై విస్తృతమైన తనిఖీలు నిర్వహిస్తారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై తగిన చర్యలు తీసుకోవడానికి తనిఖీ బృందాలకు అధికారాలు ఇచ్చారు.
    • మొదటి సారిగా పట్టుబడితే రూ.5వేల వరకు జరిమానా విధిస్తారు. రెండవ సారి అదే ట్రాక్టర్‌ కేజ్‌ వీల్స్‌తో తారు రోడ్డుపై నడిపితే జప్తు చేస్తారు. ట్రాక్టర్‌ డ్రైవర్‌కు 6నెలల వరకు జైలు శిక్ష విధిస్తారు.
    • ఇలా నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పటికీ దర్జాగా రోడ్లపై దమ్ము చక్రాలతో వాహనాలు తిరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. రోడ్లు పాడైపోతుండడంతో కోట్లాది రూపాయల ప్రజాధనం మట్టికొట్టుకుపోతోంది. ఇకనైనా సంబంధిత పోలీసు, రెవెన్యూ అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారో..
మరిన్ని వార్తలు