రణస్థలం : కోష్ఠ గ్రామానికి చెందిన మురళీమనోహర్ అనే బాలుడు గురువారం రాత్రి కిడ్నాప్కు గురై తప్పించుకుని ఇంటికి చేరుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే...కామేశ్వరి, ఉదయభాస్కర్ దంపతుల కుమారుడు మురళీమనోహర్ కోష్ఠ జంక్షన్లో గురువారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఉండగా శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వెళ్తున్న వాహనం జంక్షన్లో ఆగి అందులో ఉన్న కొందరు వ్యక్తులు బాలుడి తలపై కొట్టారు.
దీంతో మురళి స్పృహ తప్పిపోగా కారులో ఎక్కించి విశాఖ తీసుకువెళ్లారు. విశాఖ వెళ్లే సమయానికి మురళీకి తెలివి రావడంతో ఆగి ఉన్న కారులో చూసి ఎవరూ లేకపోవడంతో వెంటనే తప్పించుకుని సమీపంలోని పండ్ల కొట్టు వ్యాపారిని ఆశ్రయించి విషయం వివరించాడు. వ్యాపారి పోలీసులకు తెలియజేసి మురళీని అప్పగించడంతో విశాఖ పోలీసులు వివరాలు తెలుసుకొని మురళీని ఇంటికి అప్పగించారు. దీంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఎన్నడూ జరగని విధంగా కోష్ఠలో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడంతో సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.