విద్యార్థిని కిడ్నాప్‌నకు యత్నం

14 Nov, 2016 02:19 IST|Sakshi
జంగారెడ్డిగూడెం రూరల్‌: జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం జీడిగింజల ఫ్యాక్టరీ సమీపంలో ఓ విద్యార్థినిని కారులో ఎక్కించుకుని కిడ్నాప్‌కు యత్నించిన సంఘటన చోటుచేసుకుంది. విద్యార్థిని తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గుర్వాయిగూడెంకు చెందిన విద్యార్థిని జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్మీడియెట్‌ చదువుతోంది. ఆదివారం సాయంత్రం కళాశాలలో ప్రైవేట్‌ తరగతులు ముగించుకుని స్వగృహానికి తన స్కూటీపై వెళుతుండగా జీడిగింజల ఫ్యాక్టరీ సమీపంలో వెనుక నుంచి  ఓ కారు వే గంగా వచ్చి ఆగింది. కారులో నుంచి దిగిన వ్యక్తి స్కూటీని ఆపి వెనుక ఎవరో వ్యక్తులు కిడ్నాప్‌ చేసేందుకు వస్తున్నారని, మీ ఇంటి వద్ద దింపుతానని విద్యార్థినిని నమ్మబలికాడు. ఈ మాటలు నమ్మిన విద్యార్థిని కారులో ఎక్కి కూర్చుంది. కారు గుర్వాయిగూడెంలో విద్యార్థిని ఇంటి వద్దకు వచ్చినా ఆపకుండా వేగంగా వెళ్లిపోయింది. దీంతో అప్రమత్తమైన విద్యార్థిని మద్ది ఆంజనేయస్వామి ఆలయ సమీపంలోకి వచ్చేసరికి కారు డోర్‌ తీసి దూకే యత్నం చేయబోయింది. దీంతో కిడ్నాప్‌కు యత్నించిన వ్యక్తి కారును ఒక్కసారిగా ఆపివేశాడు. దీంతో తాను కారు దిగానని విద్యార్థిని తెలిపింది. తర్వా త తన పుస్తకాల బ్యాగును కారులో ఉన్న వ్యక్తి కిందకు విసిరేసి ఏలూరు వైపు వెళ్లిపోయాడని చెప్పింది. కారు లో ఒక వ్యక్తే ఉన్నాడని అతడే కారు నడుపుతున్నాడని తెలిపింది. విషయాన్ని విద్యార్థిని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లింది.  
 
మరిన్ని వార్తలు