కింజరాపు వారే అతి పెద్ద వడ్డీ వ్యాపారులు

18 Dec, 2015 10:51 IST|Sakshi
కింజరాపు వారే అతి పెద్ద వడ్డీ వ్యాపారులు

వారి ఇళ్లలో సోదాలు చేయాలి

వైఎస్సార్ సీపీ నేత దువ్వాడ డిమాండ్

టెక్కలి: రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న కాల్‌మనీ వ్యాపారంలో భాగంగా ఉత్తరాంధ్రలో కింజరాపు కుటుంబీకులే అతి పెద్ద వడ్డీ వ్యాపారస్తులని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. విజయవాడలో జరిగిన కాల్‌మనీ వ్యవహారంలో అధికార పార్టీకు చెందిన నేతలే అధికంగా ఉన్నారని వారిని రక్షించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని దువ్వాడ పేర్కొన్నారు.

అయితే సుమారు 25 ఏళ్ల క్రితం వందల కోట్ల రూపాయలతో ఉత్తరాంధ్రలో టిడీపీ నేత  కింజరాపు ఎర్రన్నాయుడుతో ఈ వడ్డీ వ్యాపారం ప్రారంభమైందని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తదితర ప్రాంతాల్లో పలు షాపింగ్‌మాళ్లు, హోటళ్లు, రైస్ మిల్లులు తదితర వ్యాపారాలతో పాటు పలువురు నేతలతో ఎర్రన్నాయుడు వడ్డీ వ్యాపారాలు సాగించారని దువ్వాడ చెప్పారు. అసలు నేరస్తులను విడ్చిపెట్టి సామాన్య వ్యాపారులపై పోలీసులు దాడులు చేయడం సిగ్గు చేటన్నారు. కింజరాపు కుటుంబీకులు చేసిన వడ్డీ వ్యాపారాలపై మంత్రి అచ్చెన్నాయుడు నోరు విప్పాలని దువ్వాడ డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సామాన్య వ్యాపారులపై దాడులు చేయడం కాదని కింజరాపు కుటుంబీకుల ఇళ్లల్లో సోదాలు చేసి వారిపై కేసులు నమోదు చేయాలని దువ్వాడ డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు