► రాష్ట్ర ప్రభుత్వంపై జేఏసీ చైర్మన్ కోదండరాం ఆగ్రహం
ఉప్పల్: వ్యవసాయరంగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాముఖ్యతను ఇవ్వడం లేదని జేఏసీ చైర్మన్ కోదండరాం విమర్శించారు. ఇటీవల గోపాలరత్న అవార్డు అందుకున్న వెదిరె సుధీర్చంద్రారెడ్డి దంపతులకు గురువారం ఉప్పల్ ప్రశాంత్నగర్ కమ్యూనిటీ హాలులో రైతు జేఏసీ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ.. పాడి పరిశ్రమపై తగినంత ప్రోత్సాహాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదన్నారు.
రాష్ట్రంలోని రైతులను కేంద్ర ప్రభుత్వం గుర్తించి అవార్డులు అందచేస్తున్నా ఇక్కడి ప్రభుత్వం మాత్రం గుర్తించడం లేదని విమర్శించారు. భూదాన ఉద్యమం ప్రారంభమైన భూదాన్పోచంపల్లి ప్రాంతం అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని, రైతులకు ప్రోత్సాహకాలు అందచేయాలని సూచించారు. అంతకుముందు సుధీర్చంద్రారెడ్డి దంపతులను రైతు సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కన్నెగంటి రవి, వెదిరె చల్లారెడ్డి, మేకల శివారెడ్డి, దుబ్బ నర్సింహారెడ్డి, మన్నె నర్సిం హారెడ్డి, సుదిని రామలింగారెడ్డి, ఎలిగేటి మోహన్రెడ్డి, మధుసూదన్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, రఘుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.