హెచ్చరికలు బేఖాతరు

16 Jan, 2017 00:05 IST|Sakshi
హెచ్చరికలు బేఖాతరు
  • పండగ మూడు రోజుల్లో రూ.30 కోట్ల మేర సాగిన కోడిపందేలు
  • కత్తులు కట్టి మరీ బరితెగించిన పందెగాళ్లు
  • కోర్టు ఆదేశాలు, 144 సెక్ష¯ŒS ఉన్నా.. పట్టించుకోని వైనం
  • యథేచ్ఛగా గుండాటలు, అశ్లీల నృత్యాలు
  • అయినా పత్తా లేని పోలీసులు
  • సాక్షి ప్రతినిధి, కాకినాడ :
    కోడిపందేలు నిర్వహించరాదంటూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా.. ఈ నెల 25వ తేదీ వరకూ 144 సెక్ష¯ŒS విధిస్తున్నామని, ఐదుగురికంటే ఎక్కువమంది గుమిగూడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్వయంగా జిల్లా కలెక్టరే హెచ్చరించినా.. పందెగాళ్లు బేఖాతర్‌ అన్నారు. ఫలితంగా సంక్రాంతి పండగా మూడు రోజులూ.. సంప్రదాయం ముసుగులో జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కోడిపందేలు, గుండాట, మూడుముక్కలాటలు, అశ్లీల నృత్యాలు యథేచ్ఛగా సాగాయి. మునుపెన్నడూ లేని రీతిలో పందెగాళ్లు ఈ మూడు రోజుల్లో రూ.30 కోట్ల మేర కొల్ల గొట్టారు. ఇందులో ‘తమ్ముళ్ల’కు, పోలీసులకు వాటాలు అందడంతో పందెంకోళ్లకు పగ్గాలు వేసేవారే లేకపోయారు. ప్రధానంగా కోనసీమలో అధికార పార్టీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే పందేలు విచ్చలవిడిగా సాగాయి.
    మురమళ్లలో డ్రోన్ల వినియోగం
    ఐ.పోలవరం మండలం మురమళ్లలోని కోడిపందేల బరి జిల్లాలోనే అతి పెద్దది. దీంతో దీనినో క్రీడాస్థలంలా తయారు చేశారు. బరుల చుట్టూ గ్యాలరీలు ఏర్పాటు చేశారు. పందేలు జరుగుతున్న తీరును డ్రో¯ŒS కెమెరాలతో చిత్రించారు. ఈ బరిలో ప్రతి పందెం రూ.లక్షల్లోనే సాగింది. ముమ్మిడివరం టీడీపీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు వీఐపీ గ్యాలరీలో తొలి వరుసలోనే కూర్చుని ఇక్కడి పందేలను స్వయంగా జరిపించారు. భోజన విరామం కూడా లేకుండా ఉదయం నుంచి రాత్రి వరకూ పందేలు నిర్విరామంగా నిర్వహించారు. మధ్యాహ్నం, రాత్రి భోజన సమయాల్లో గ్యాలరీలో కూర్చునవారికి నిర్వాహకులు చికె¯ŒS బిర్యానీ బాక్సులు అందించడంతో ఏమాత్రం బ్రేక్‌ లేకుండా పందేలు సాగాయి. ఈ ఒక్క బరిలోనే రోజూ దాదాపు రూ.5 కోట్ల చొప్పున మూడు రోజుల్లో రూ.15 కోట్ల మేర పందేలు జరిగాయి. మురమళ్ల బరిలో పందేలు చూసేందుకు జిల్లావ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. ఇక్కడ గుండాట కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ బరి వద్ద గుండాట ఏర్పాటుకు రూ.38 లక్షలతో హక్కులు సొంతం చేసుకున్న నిర్వాహకులు రోజుకు రూ.50 లక్షల పైనే ఆర్జించారు. ఇందులో తెలుగు తమ్ముళ్లకు కూడా 30 శాతం వాటాలు అందాయి.
    డిప్యూటీ సీఎం ఇలాకాల్లో..
    ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి అయిన నిమ్మకాయల చినరాజప్ప సొంత నియోజకవర్గం అమలాపురంతో పాటు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలో కూడా మూడు రోజులూ కోడిపందేలు జోరుగా జరిగాయి. అల్లవరం మండలం గోడి, గోడిలంక, గుండెపూడి, అల్లవరం, ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి, ఎ¯ŒS.కొత్తపల్లి, చల్లపల్లి, కూనవరంలో అమాత్యుని అండ ఉందనే ధైర్యంతో పందెగాళ్లు లక్షల్లోనే పందేలు కాశారు. పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. పెద్దాపురం నియోజకవర్గం వేట్లపాలెం, మేడపాడు, వీకే రాయపురం, మాధవపట్నం గ్రామాల్లోని బరుల్లో లక్షలాది రూపాయలు చేతులు మారాయి. రాజోలు దీవిలో కూడా పందేలు యథేచ్ఛగా సాగాయి. మండలంలోని చింతలపల్లి, ఉయ్యూరివారి మెరక, మలికిపురం, అంతర్వేది, సఖినేటిపల్లిలంక తదితర ప్రాంతాల్లో పందేలు నిర్వహించారు.
    మెట్టప్రాంతంలో..
    మెట్టలోని జగ్గంపేట నియోజకవర్గంలో భోగి నుంచి కనుమ పండగ వరకూ కోడిపందేలు జోరుగా జరిగాయి. ప్రధానంగా కిర్లంపూడిలో కోడిపందేలు జరిగాయి. కాకినాడ ఎంపీ తోట నరసింహం తన కుమారుడు, అల్లుడితో కలిసి ఆదివారం సాయంత్రం ఇక్కడ పందేలను తిలకించారు. కిర్లంపూడి మండలంలో వేలంక, గోనేడ, తామరాడ, కృష్ణవరం, జగ్గంపేట మండలం కాట్రావుపల్లి, మర్రిపాక, రాజపూడి, జె.కొత్తూరు, వెంగాయమ్మపురం, గోవిందపురం, గండేపల్లి మండలం సింగరంపాలెం, మల్లేపల్లి, నీలాద్రిరావుపేట, గోకవరం మండలం కృష్ణునిపాలెం, కామరాజుపేట, మల్లవరం తదితర గ్రామాల్లో జరిగిన కోడిపందేల్లో లక్షలాది రూపాయలు చేతులు మారాయి. రాజమహేంద్రవరం రూరల్‌ కవలగొయ్యి, కోలమూరు, వేమగిరి, కడియపులంక తదితర గ్రామాల పరిధిలో ఈ మూడు రోజులూ కోడిపందేలు అర్ధరాత్రి వరకూ నిర్వహించారు. అధికార పార్టీ నాయకులు దగ్గరుండి మరీ పందేలను ప్రోత్సహించారు. కోడిపందేలకు తోడుగా ఆయా బరుల వద్ద గుండాట, ముక్కతిప్పుడు, మద్యం, సారా అందుబాటులోకి తెచ్చారు. ఈ మూడు రోజుల్లోనే రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ చేతులు మారాయి.
    మండపేట నియోజకవర్గం మండపేట అర్బన్, రాయవరం, కపిలేశ్వరపురం మండలం లంకల్లోనూ రూ.50 లక్షలకు పైగా పందేలు జరిగాయి. అనపర్తి నియోజకవర్గం కొమరిపాలెం, అనపర్తి, గొల్లల మామిడాడ, మెట్ట గ్రామాల్లోను, రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు, యండగండి, పల్లిపాలెం తదితర గ్రామాల్లోనూ, కాకినాడ రూరల్‌ పరిధి భావారం తోటలు, గొర్రిపూడి, పెనుమర్తి, గురజనాపల్లి, పెద్దాపురప్పాడు తదితర గ్రామాల్లోనూ, పిఠాపురం, తుని, ప్రత్తిపాడు, రాజానగరం నియోజకవర్గాల పరిధిలోనూ భారీగా పందేలు నిర్వహించారు.
     
    విచ్చలవిడిగా అశ్లీల నృత్యాలు
    సందట్లో సడేమియా అన్నట్టు కొన్నిచోట్ల అశ్లీల నృత్యాలకూ తెర తీశారు. మలికిపురం మండలం కేశనపల్లి, తూర్పుపాలెం, పడమటిపాలెం, గుడిమెళ్లంక, ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి, కొత్తపేట ప్రభల తీర్థాల్లో విచ్చలవిడిగా అశ్లీల నృత్యాలు నిర్వహించారు. రాత్రి మొదలైన ఈ నృత్యాలు అర్ధరాత్రయ్యేసరికి శృతి మించిపోయాయి. కోనసీమవ్యాప్తంగా కుర్రకారు ఈ నృత్యాలను తిలకించేందుకు తండోపతండాలుగా వెళ్లారు. వీటి విషయంలో కూడా పోలీసులు మౌనంగానే ఉండిపోయారు.
     
మరిన్ని వార్తలు