పార్టీ అధికారంలోకి వస్తే నేనే సీఎం: కోమటిరెడ్డి

11 Dec, 2016 08:34 IST|Sakshi
కడెం ప్రాజెక్టుపై మార్నింగ్‌వాక్‌ చేస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

కడెం: రాష్ట్రంలో 2019 లో కాంగ్రెస్‌దే అధికారమని, అప్పుడు సీఎం రేసులో తానే ఉంటానని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. భవిష్య త్తులో ఎప్పటికైనా తాను సీఎంను కావటం ఖాయమని పేర్కొన్నారు. ఆయన తన స్నేహితులతో కలసి శుక్రవారంరాత్రి నిర్మల్‌ జిల్లా కడెంకు వచ్చారు. శనివారం హరితా రిసార్ట్స్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆనాడు ఆంధ్రావారిని తీవ్రంగా విమర్శించిన ప్రభుత్వ పెద్దలు.. నేడు ఆంధ్రా వారికే వివిధ కాంట్రాక్టు పనులు అప్పగిస్తున్నారని ఆరోపించారు.

ప్రభుత్వ ఖజానాను సీఎం ఇష్టారా జ్యంగా దుబారా చేస్తున్నారని విమర్శించారు. పెద్దనోట్ల రద్దుతో సామాన్యులు ముఖ్యంగా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, మోదీ నిర్ణయం సరికాదని అన్నారు. ఆయన ఉదయం వాకింగ్‌కని ప్రాజెక్టుకు వెళ్లి పరిశీలించారు. వరద గేట్ల నుంచి లీకేజీలు, నీటిమట్టం గది, గేట్లు ఎత్తే గదులను చూసి, వాటిని మరమ్మతులు చేయాలని ఇరిగేషన్‌ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు.

మరిన్ని వార్తలు