కోనసీమ ప్రత్యేక జిల్లాయే అందరి లక్ష్యం

21 Dec, 2016 23:39 IST|Sakshi
కేఏఎస్‌ఎస్‌ అధ్యక్షుడు ఆర్‌వీ నాయుడు
కొత్తపేట : కోనసీమ ప్రత్యేక జిల్లా సాధన ప్రతీఒక్కరి లక్ష్యం కావాలని కోనసీమ అభివృద్ధి సాధన సమితి (కేఏఎస్‌ఎస్‌) అధ్యక్షుడు ఆర్‌వీ నాయుడు పిలుపునిచ్చారు. కొత్తపేటలో సంఘ ప్రణాళిక కార్యదర్శి సత్తిరాజు ఆదిత్యకిరణ్‌ స్వగృహంలో బుధవారం సమితి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, సమితి వ్యవస్థాపకుడు పాలూరి సత్యానందం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్‌వీ నాయుడు మాట్లాడారు. కోనసీమలో ఎన్నో ఆర్థిక వనరులున్నా, అవి కోనసీమ అభివృద్ధికి దోహదపడటం లేదని పేర్కొన్నారు. ఇక్కడి  చమురు, సహజ వాయువు వంటివి ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కోనసీమ ప్రత్యేక జిల్లా ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. జిల్లా ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, కోనసీమలో మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలను కలిసి, వారి మద్దతుతో ఈ డిమాండ్‌ను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని తీర్మానించారు. ఈ సమావేశంలో సమితి ప్రతినిధులు కముజు గంగాధరరావు, బండి రామకృష్ణ, అడ్డగాళ్ళ సాయిరాం, గాడి సత్తిబాబు, వాడపల్లి సూరిబాబు, మోకా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు
మరిన్ని వార్తలు