కేటీఆర్‌కు సిరిసిల్ల జిల్లా సెగ

26 Sep, 2016 02:07 IST|Sakshi
కేటీఆర్‌కు సిరిసిల్ల జిల్లా సెగ

కాన్వాయిపై రాళ్లు రువ్విన అడ్వకేట్ జేఏసీ నాయకులు
ఎల్లారెడ్డిపేట: కరీంనగర్ జిల్లా గంభీరావుపేట మండలం మల్లుపల్లె వద్ద మంత్రి కేటీఆర్ పర్యటనను సిరిసిల్ల జిల్లా డిమాండ్‌తో అడ్వకేట్ జేఏసీ నాయకులు అడ్డుకోవడం, రాళ్లదాడితో ఆదివారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సంఘటనలో ఆర్మీ పోలీస్ వ్యానుతో పాటు ఎల్లారెడ్డిపేట ఎంపీపీ ఎలుసాని సుజాత వాహనం ధ్వంసమయ్యాయి. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. వరదలతో ఎగువ మానేరు జలకళ సంతరించుకోగా మంత్రి కేటీఆర్ ఆదివారం సాయంత్రం జలాశయూన్ని సందర్శించారు.

అనంతరం ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్‌కు వస్తున్న క్రమంలో మల్లుపల్లె వద్ద దెబ్బతిన్న పంట పొలాలను మంత్రి పరిశీలించి తిరిగి వెళ్తుండగా, న్యాయవాద జేఏసీ నాయకులు మంత్రి వాహనాన్ని అడ్డుకున్నారు. సిరిసిల్ల జిల్లా ఏర్పాటుపై హామీ ఇవ్వాలని, లేకుంటే కదలనిచ్చేది లేదని మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి వాహనానికి అడ్డుగా కూర్చోవడంతో పరిస్థితి చేయి దాటిపోయింది. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు మంత్రి కాన్వాయిపై రాళ్లు రువ్వడంతో అప్రమత్తమైన పోలీసులు లాఠీలకు పని చెప్పారు.

మరిన్ని వార్తలు