కర్నూలు బాలిక కిడ్నాప్‌ కేసు ఛేదింపు

1 Nov, 2016 01:14 IST|Sakshi

అనంతపురం సెంట్రల్‌ : కర్నూలులో కిడ్నాపైన బాలిక కేసును అనంతపురం పోలీసులు ఛేదించారు. వివరాల్లోకెళితే.. కర్నూలు పట్టణానికి చెందిన తొమ్మిదేళ్ల బాలికకు హిందూపురంలోని బోయవీధికి చెందిన పఠాన్‌ అజంతుల్లా అనే యువకుడు ఆదివారం మాయమాటలు చెప్పి అనంతపురానికి ఆర్టీసీ బస్సులో తీసుకొచ్చాడు. అక్కడి నుంచి హిందూపురం వెళ్లేందుకు  బస్సు కోసం నిరీక్షించాడు. బాలిక ఏడుస్తుండడంతో పాటు కిడ్నాపర్‌ అనుమానాస్పందంగా కనిపించడం సీసీ కెమెరాల్లో పసిగట్టిన త్రీటౌన్‌ సీఐ గోరంట్ల మాధవ్, ఎస్‌ఐ రెడ్డప్పలు వెంటనే బస్టాండుకు వచ్చి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తీసుకుపోయి విచారణ చేస్తే అసలు విషయం బయటపెట్టాడు. సదరు కిడ్నాపర్‌ గతంలో కూడా ఇలాంటి నేరాలు చేసినట్లు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. కేవలం కిడ్నాప్‌ చేసి వారి తల్లిదండ్రుల నుంచి డబ్బు వసూలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ నేరానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వెంటనే త్రీటౌన్‌ సీఐ గోరంట్ల మాధవ్‌ ఫోన్‌ ద్వారా కర్నూలు నాలుగో పట్టణ ఎస్‌ఐ సుబ్రమణ్యంరెడ్డితో మాట్లాడారు. వారు అనంతపురం వచ్చి కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకుని, బాలికను వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.

మరిన్ని వార్తలు