మంత్రాలయం-కర్నూలు రైల్వే లైన్‌కు రీసర్వే

3 Feb, 2017 23:26 IST|Sakshi
మంత్రాలయం రైల్వే లైన్‌కు రీసర్వే
– ఎంపీ బుట్టా రేణుక
 
కర్నూలు(రాజ్‌విహార్‌): మంత్రాలయం నుంచి కర్నూలు వరకు కొత్త రైల్వే లైను నిర్మాణానికి రీ సర్వే నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. శుక్రవారం ఆమె ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడంపై పార్లమెంటులో ప్రశ్నించానన్నారు. అయితే కర్నూలు – మంత్రాలయం మధ్య రోడ్డు ట్రాఫిక్‌ అంతంత మాత్రంగానే ఉందని, ఈ క్రమంలో రైల్వే లైను వేస్తే ప్రయాణికుల రద్దీ లేక తమ శాఖకు నష్టం వాటిల్లుతుందనే సమాధానం వచ్చిందన్నారు. అయితే ఇది వరకే చేసిన సర్వే 2010 సంవత్సరం నాటిదని, ప్రస్తుతం ఏడేళ్లు గడిచాయని.. మంత్రాలయానికి భక్తుల రద్దీ పెరిగడంతో పాటు పశ్చిమ ప్రాంతానికి ప్రయాణ సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సభ దృష్టికి తీసుకెళ్లానన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం మరోసారి సర్వే చేయాలని ఒత్తిడి తేవడంతో కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు ఆమె వెల్లడించారు.
 
మరిన్ని వార్తలు