ఉపాధి పనులకు వెళ్తే ఆగిన ఊపిరి

27 Apr, 2017 00:58 IST|Sakshi
కుందుర్పి(కళ్యాణదుర్గం) : కుందుర్పి మండలం తూముకుంటలో చంద్రశేఖర్‌(38) అనే కూలీ ఉపాధి పనులు చేస్తుండగానే.. గుండెపోటుకు గురై ఊపిరి ఆగింది. రోజులాగే బుధవారం ఉదయం గ్రామ శివార్లలో జరుగుతున్న ఫారంపాండ్‌ తవ్వేందుకు తోటి కూలీలతో కలసి వెళ్లాడు. ఉదయం 11 గంటలకు పనుల్లో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురవడంతో కుప్పకూలిపోయాడని కూలీలు తెలిపారు. వెంటనే కుందుర్పి పీహెచ్‌సీకి తరలించేందుకు ప్రయత్నిస్తుండగానే ప్రాణాలొదిలినట్లు చెప్పారు. మృతుడికి భార్య పద్మజ, ఇద్దరు కుమారులు ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ ప్రవీణ, వెలుగు ఏపీఎం తిమ్మప్ప, ఏపీఓ నీరజ, తహసీల్దార్‌ రమేషన్‌ తూముకుంటకు చేరుకున్నారు. మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఉపాధి హామీ నుంచి రూ.50 వేలు, చంద్రన్న బీమా పథకం కింద మరో రూ.25 వేలు అందజేస్తామని ప్రకటించారు. తక్షణ సాయంగా రూ.5 వేలు అందించారు.
మరిన్ని వార్తలు