ఇంటర్నేషనల్‌ ఫిలింఫెస్ట్‌వల్‌కు ‘లక్ష్మీనరసింహస్వామి’

18 Jul, 2016 00:45 IST|Sakshi
ఇంటర్నేషనల్‌ ఫిలింఫెస్ట్‌వల్‌కు ‘లక్ష్మీనరసింహస్వామి’
కొలిమిగుండ్ల: శ్రీకృష్ణదేవరాయల పరిపాలన కాలంలో కొలిమిగుండ్ల కొండపై నిర్మితమైన లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్‌ షార్ట్‌ఫిలిం (డ్యాక్యుమెంటరీ) ఫెస్టివల్‌లో స్థానం లభించింది. మూడు రోజుల క్రితం వీటికి సంబంధించిన ఫలితాలను జ్యూరీ మెంబర్స్‌ విడుదల చేశారు. ఈడాక్యుమెంటరీని అనంతపురానికి చెందిన మక్కం అవినాష్‌కుమార్‌ దర్శకత్వంలో నిర్మించారు.  మన ఊరు–మన పురాతన దేవాలయం నాడు–నేడు అనే అంశంపై సేవ్‌ టెంపుల్స్‌ ఆర్గనైజేషన్, గ్లోబల్‌ హిందూ హెరిటేజ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ డాక్యుమెంటరీ చలన చిత్రత్సోవ పోటీలు ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాలు, దేశాల  నుంచి 113 డాక్యుమెంటరీలు వచ్చినట్లు అవినాష్‌కుమార్‌ తెలిపారు.  ఇందులో కొలిమిగుండ్ల లక్ష్మీనరసింహస్వామి పేరుతో తీసిన డాక్యుమెంటరీకి నాల్గవ స్థానం దక్కిందని ఆయన ఆదివారం సాక్షికి తెలిపారు. ఎంపికైన వాటికి సంబంధించి ఆగష్టు మూడవ వారంలో హైదరాబాద్‌ ప్రసాద్‌ ఐమాక్స్‌లో మూడు రోజుల పాటు ప్రదర్శనతో పాటు అవార్డులు ప్రదానం చేస్తారన్నారు. ఇందులో భాగంగా రూ.10వేల నగదు అందజేస్తారన్నారు. శిథిలావస్థకు చేరుకుంటున్న చారిత్రక ఆలయాలను అభివద్ధి చేసేందుకు  ఏటా నిర్వాహకులు అంతర్జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఎన్‌ఆర్‌ఐలు స్పందించి విరాళాలు ఇస్తే ఆలయాలకు పూర్వవైభవం తీసుకురావాలనే గొప్ప సదుద్దేశంతో పోటీలు  జరుపుతున్నారన్నారు. 
 
మరిన్ని వార్తలు