కర్నూలు(అగ్రికల్చర్): ఎస్సీలకు భూమి కొనుగోలు పథకం కింద భూమి కొనిచ్చే ప్రతిపాదనలపై జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ నియమించిన ప్రత్యేక కమిటీ పరిశీలన చేపట్టింది. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రాలయం, శ్రీశైలం, బనగానపల్లి, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, ఆలూరు నియోజకవర్గాలకు చెందిన తహసీల్దార్లు ప్రతిపాదనలు తెచ్చారు. వీటిని కేఆర్ఆర్సీ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ సత్యనారాయణ, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి వెంకటనారాయణ, సి, ఈ సెక్షన్ సూపరింటెండెంట్లు రామాంజనమ్మ, ప్రియదర్శిని తదితరులు పరిశీలించారు. మంత్రాలయం, శ్రీశైలం, బనగానపల్లి నియోజకవర్గాల నుంచి 70 ప్రతిపాదనలు రాగా 40 ఆమోదించారు. ఎకరా యూనిట్ కాస్ట్ రూ.5 లక్షలు ఉండగా ప్రభుత్వం రూ.2లక్షలు సబ్సిడీ ఇస్తుంది. స్రీ నిధి నుంచి రూ.3లక్షలు లోన్ ఇస్తారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వీర ఓబులు తదితరులు పాల్గొన్నారు.