రీ సర్వేతో భూ సమస్యలకు పరిష్కారం

1 Mar, 2017 22:50 IST|Sakshi
రీ సర్వేతో భూ సమస్యలకు పరిష్కారం
-  కొందరు చేసిన తప్పులను
  వ్యవస్థకంతా అపాదించొద్దు 
 – విలేకరుల సమావేశంలో ఏపీ జేఏసీ
  అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు
 
 కర్నూలు(అగ్రికల్చర్‌): మీ ఇంటికి మీ భూమి కార్యక్రమం ద్వారా 90శాతం భూసమస్యలు పరిష్కారం అయ్యాయని,మిగిలిన సమస్యలు పరిష్కారం కావలంటే భూముల రీ సర్వే చేపట్టాలని ఏపీ జేఏసీ (అమరావతి) చైర్మన్‌ , రాష్ట్ర రెవెన్యూ సర్వీస్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెవెన్యూ శాఖలో ఎక్కడో ఒకరిద్దరు చేసిన పనులను మొత్తం వ్యవస్థకే అపాదించొద్దని కోరారు. రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వం అప్పగించిన అన్ని పనులను విజయంతంగా నిర్వహిస్తోందని కర్నూలు జిల్లాలోని ఇండస్ట్రియల్‌ పార్క్‌కు, అమరావతి నిర్మాణానికి సకాలంలో భూములు సేకరించి ఇచ్చిన ఘనత రెవెన్యూదేనని చెప్పారు. ఉద్యోగులకు తగిన సదుపాయాలు, శిక్షణ ఇస్తే ఎటువంటి క్లిష్టతరమైన పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. గతంలో ఎపుడూ లేని విధంగా సంస్కరణలు తీసుకవచ్చామని వివరించారు.
 
భూముల రిజిస్ట్రేషన్‌లకు ముందే సబ్‌ డివిజన్‌లు చేయడం వల్ల భూ సమస్యలు తగ్గతాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రవేశపెట్టిన హెల్త్‌ కార్డుల విధానం లోపభూయిష్టంగా ఉందని, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఏ కార్పేరేట్‌ ఆసుపత్రి వీటిని గుర్తించడం లేదని వాపోయారు. బయోమెట్రిక్‌ విధానంలో క్షేత్రస్థాయికి వెళ్లే వారికి కొంత మినహాయింపునివ్వాలని సూచించారు. రాష్ట్ర సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపకుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... సీపీఎస్‌ ఉద్యోగులకు పాత పెన్షన్‌ స్కీమ్‌ను అమలు చేయడంలో ఎన్‌జీఓ అసోషియేషన్‌ అధ్యక్షడు అశోక్‌బాబు విఫలం అయ్యారని ఆరోపించారు.  
 
ఏపీ జేఏసీకి సంఘీభావం.... 
బీసీ హాస్టల్‌ వెల్పేర్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఏపీ జేఏసీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు తెలిపారు. రాష్ట్ర ఏఎన్‌ఎంల సంఘం కూడా మద్దతు ఇస్తోందని అధ్యక్షురాలు సులోచనమ్మ చెప్పారు. రాష్ట్ర టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ల అసోసియేషన్‌ మద్దతుగా నిలుస్తోందని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.   సమావేశంలో రాష్ట్ర గెజిటెడ్‌ అధికారుల సంఘం నేత యోగేశ్వరరెడ్డి, కో ఆపరేటివ్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నేత వీర్రాజు, జ్యుడీషియల్‌ ఉద్యోగుల సంఘం నేత గిరిధర్, సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపకుడు శ్రీనివాసరెడ్డి , రెవెన్యూ సర్వీస్‌ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌ బాబు, కార్యదర్శి గిరికుమార్‌ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షడు ఉశేన్‌ సాహెబ్‌ జిల్లా నాయకులు వేణుగాపాల్‌ రావు,రామన్న, శ్రీనివాసులు,జలాలుద్దీన్‌,వీఆర్వోల సంఘం జిల్లా అధ్యక్షుడు రాముడు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు