చివరికి ఇలా.. తేల్చేశారు!

31 May, 2016 12:24 IST|Sakshi

నీరుగారిన లావణ్య మృతి కేసు
అది రోడ్డు ప్రమాదమేనని సీపీ స్పష్టీకరణ
ఆయన చెప్పిన వివరాల్లోనే ఎన్నో కొత్త ప్రశ్నలు
లాడ్జిలో సీసీ కెమెరా ఫుటేజ్ మాయం
ఎలుకలు కొరికేశాయని నిర్వాహకుల సమాధానం
ఆలయం వెలుపలి ఫుటేజ్ చూపనే లేదు
రికార్డులకెక్కని క్షతగాత్రురాలి స్టేటమెంట్
లాడ్జి బాయ్ చెప్పిందే ప్రామాణికం
సాధారణ ప్రమాదమే అయితే నిందితుల అరెస్టుకు వారమెందుకు?

 

మందు కొట్టింది నిజం.. అదే మత్తులో ఫోనులో మాట్లాడుతూ కారు నడిపిందీ నిజం.. వెనుక నుంచి మాటిమాటికీ హారన్ కొడుతూ కారును ముందుకూ.. వెనక్కూ నడుపుతూ బైక్‌పై ఉన్న వారిని ఇబ్బంది పెట్టడం కూడా నిజమే..  కానీ.. కావాలని బైకును గుద్ది హత్య చేశారనడం మాత్రం అవాస్తవమట!.. అది కేవలం మద్యం మత్తులో ఉండగా జరిగిన ప్రమాదమేనట!!  సంచలనం సృష్టించిన లావణ్య మృతి కేసును పోలీస్ బాస్‌లు ఇలా తేల్చేశారు.


ఆలయం వెలుపల వీడియో ఫుటేజ్‌లు చూడలేదు.. ప్రత్యక్ష సాక్షి, క్షతగాత్రురాలు చెప్పిన విషయాలకూ విలువివ్వలేదు.. లాడ్జి బాయ్ చెప్పినదాన్ని మాత్రం విశ్వసించారు. మొత్తానికి వేధింపులు, కారుతో కావాలని ఢీకొట్టడం.. అన్నవి ఉత్తుత్తి ఆరోపణలేనని తేల్చేశారు.

 దర్యాప్తులో తేలిన విషయాలంటూ పోలీసు అధికారులు చెప్పిన వివరాల్లోనే.. ఎన్నో కొత్త ప్రశ్నలు తొంగిచూశాయి. వాటికి మాత్రం సమాధానం లేదు.

 

విశాఖపట్నం: డబ్బు, రాజకీయం, అధికారం.. మరోసారి కలిసిపోయాయి. నిర్భయ స్థాయి కేసును కేవలం ప్రమాదం కేసుగా మార్చేశాయి. ఈ నెల 22న వడ్లపూడికి చెందిన మాటూరి లావణ్య కారు ఢీకొట్టడంతో మరణించిన కేసును మద్యం మత్తులో అనుకోకుండా జరిగిన ప్రమాద కేసుగా  పోలీసులు తేల్చారు. ఆమెను కొందరు పోకిరీలు  వేధించి, వెంబడించి, ఉద్దేశపూర్వకంగా కారుతో ఢీకొట్టి హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు నెత్తీనోరూ కొట్టుకున్నా.. అబ్బే.. అలాంటిదేమీ జరగలేదని పోలీసులు తమ విచారణలో తేల్చేశారు. అనకాపల్లి నూకాంబిక ఆలయం లోపలి సీసీ కెమెరా దృశ్యాలను చూపించి.. ఆలయం వెలుపల ఎలాంటి వేధింపులు జరగలేదంటున్నారు. ఎస్‌ఆర్ రెసిడెన్సీ లాడ్జి రూమ్ బాయ్ మాటల ఆధారంగా నిందితులు ఆరోజు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ హోటల్‌లోనే ఉన్నట్లు నిర్ధారణకు వచ్చేశారు. సంఘటన రోడ్డు ప్రమాదమేనని అంటున్నప్పుడు, నిందితులెవరో తెలిసినప్పుడు అరెస్ట్ చేయడానికి వారం రోజులు ఎందుకు పట్టిందనే ప్రశ్నకు అధికారుల వద్ద సరైన సమాధానం లేదు. ప్రత్యక్ష సాక్షి, ప్రమాదంలో గాయపడిన దివ్య చెప్పిన మాటలు ఇప్పుడు ఏమయ్యాయంటే జవాబు లేదు. ఇలా ఈ కేసులో అనేక ప్రశ్నలు, అనుమానాలను నివృత్తి చేయకుండానే మద్యం మత్తులో జరిగిన రోడ్డు ప్రమాదంగా పోలీసులు నిర్ధారించారు.

 
దివ్య వాంగ్మూలం ఏమైంది?

నూకాంబిక ఆలయం బయటే తమకు వేధింపులు మొదలయ్యాయని, తమను వెంబడించి వేధించారని, కావాలనే కారుతో ఢీకొట్టారని మృతురాలు లావణ్య ఆడపడుచు దివ్య ఆ రోజు మీడియాకు వెల్లడించింది. ప్రమాదంలో గాయపడిన ఆమె ప్రత్యక్ష సాక్షి కావడంతో ఆమె మాటలకు ప్రాధాన్యత ఉంది. కానీ ఇప్పుడు అవేవీ పోలీసు రికార్డుల్లో లేవు. తమ విచారణలో ఆమె అలా ఏమీ చెప్పలేదని పోలీసు అధికారులు అంటున్నారు. ఆమెను నయానో భయానో ప్రభావితం చేయడం వల్లే పోలీసులకు నిజాలు వెల్లడించేందుకు వెనకడుగు వేస్తుండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 
దేవాలయం వెలుపల ఫుటేజీ ఏదీ?

నూకాంబిక ఆలయంలో మొత్తం 22 సీసీ కెమెరాలున్నాయి. ఆలయం లోపల 7 సీసీ కెమెరాలుండగా మిగతా వాటిని ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. అయితే ఆలయం లోపలి కెమెరాల్లోని ఫుటేజీనే పోలీసులు బయటపెట్టారు. వాటి ప్రకారం.. లావణ్య మధ్యాహ్నం 2.59 గంటలకు ఆలయంలోకి ప్రవేశించింది. ఆమె క్యూ లైన్లో ఉన్నట్లు కామ్-6లో, ప్రసాదం తీసుకుంటున్నట్లు కాామ్-3లో, అమ్మవారిని దర్శించుకున్నట్లు కామ్-1లో రికార్డయ్యింది. ఆలయం అవుట్ గేటు నుంచి బయటకు వస్తున్నట్లు కామ్-4 చూపిస్తోంది. అప్పటికి సమయం 3.31 గంటలు. తర్వాత లావణ్య, మరో ఇద్దరు ద్విచక్ర వాహనంపై వడ్లపూడికి బయలుదేరారు. సాలపువానిపాలెం వద్ద హేమకుమార్ కారు ఢీకొట్టడంతో లావణ్య చనిపోయింది. ఈ దృశ్యాల్లో ఎక్కడా నిందితులు కనిపించలేదు. కానీ బాధితులు సంఘటన జరిగిన రోజు చెప్పిన దాని ప్రకారం లావణ్యను నిందితులు ఆలయం వెలుపల వేధించారు. దీన్ని నిర్థారించాలంటే ఆలయం వెలుపల ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించాల్సి ఉంది. కానీ వాటిలో ఎక్కడా లావణ్య కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా గత మూడేళ్లలో ఆలయ పరిసరాల్లో ఈవ్ టీజింగ్ కేసు నమోదు కాలేదని  స్థానిక పోలీస్ స్టేషన్ రికార్డులు, రూరల్ ఎస్పీ వివరాలను ఉటంకిస్తూ ఆలయంలో ఎలాంటి వేధింపులు జరగలేదని నిర్ధారించామని సీపీ చెప్పారు.

 
లాడ్జిలో ఫుటేజ్‌లను ఎలుకలు కొరికేశాయట!

ఆరోజు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ నిందితులు తమ స్నేహితులతో కలిసి అనకాపల్లి ఎస్‌ఆర్ రెసిడెన్సీ రూము నెం.315లో ఉన్నారని పోలీసులు నిర్ధారించారు. అక్కడి రూమ్ బాయ్ ఇచ్చిన వాంగ్మూలాన్ని దీనికి ప్రామాణికంగా తీసుకున్నారు. కాగా బర్మా కాలనీకి చెందిన రాజు అనే వ్యక్తి పేరు మీద 315 రూమ్‌ను తీసుకున్నారని సమాచారం. కానీ పోలీసులు చెప్పిన ఎమిమిది మందిలో రాజు అనే పేరుతో ఎవరూ లేరు. లాడ్జిలో సీసీ కెమెరా ఫుటేజీని తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే సీసీ కెమెరాల వైర్లను ఎలుకలు కొరికేశాయని, అందువల్ల అవి 15 రోజులుగా పని చేయడం లేదని నిర్వాహకులు చెప్పారట. అసలు సీసీ కెమెరాల వైర్లను ఎలుకలు నిజంగా కొరికేశాయా?.. ఎలుకల బెడద అంతలా ఉంటే రెసిడెన్సీని ఎలా నడుపుతున్నారు??.. 15 రోజుల నుంచి కెమెరాలు పనిచేయకపోతే ఎందుకు బాగు చేయించలేదు???.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయలేదు. అన్నింటికీ మించి బ్యాక్ ఇన్‌స్ట్రుమెంట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోలేదు. దాన్ని స్వాధీనం చేసుకుని సాంకేతికంగా విశ్లేషించి ఉంటే మరిన్ని వివరాలు తెలిసేవి. కనీసం సీసీ కెమెరాలు ఎప్పటినుంచి పనిచేయడం లేదో తెలిసేది.

 
మీడియాను ఆధారాలు అడుగుతున్న సీపీ

ఇన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు లేకుండానే దర్యాప్తు ముగించడం ఆందోళనకు గురి చేస్తోంది. అదీ కాక లావణ్య కేసులో నిందితులను పట్టుకోవడానికి వారం రోజుల సమయం తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది. రాజకీయ జోక్యం ఉన్నట్లు, సెటిల్‌మెంట్ జరిగినట్లు ఆధారాలుంటే ఇవ్వమని మీడియాను సీపీ స్వయంగా అడగడం హాస్యాస్పదంగా ఉంది. ఆధారాలు సేకరించి నేరస్తులను పట్టుకోవాల్సిన ఉన్నతాధికారి ఈ విధంగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది.

 

>
మరిన్ని వార్తలు