పెండింగ్ సమస్యలు పరిష్కరించండి

9 Nov, 2016 04:43 IST|Sakshi

ఏసీజేకు న్యాయశాఖ ఉద్యోగుల సంఘం వినతి
సాక్షి, హైదరాబాద్: గత కొన్నేళ్లుగా ఉన్న పెండింగ్ సమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్‌కు న్యాయశాఖ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.లక్ష్మారెడ్డి నేతృత్వంలో తెలంగాణ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు జగన్, రాజశేఖర్‌రెడ్డి మంగళవారం ఏసీజేను కలసి వినతిపత్రం సమర్పించారు. న్యాయశాఖ ఉద్యోగుల సమస్యలపై సంఘం ప్రతినిధులతో చర్చించాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించారు.

శెట్టి కమిషన్ సిఫార్సుల మేరకు కొత్తగా ఇవ్వాల్సిన పోస్టులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో స్పష్టం చేయాలని అక్కడే ఉన్న న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డిని ఏసీజే ప్రశ్నించారు. కాగా, తమ సమస్యలపై ఏసీజే సానుకూలంగా స్పందించారని, సమ్మె కాలాన్ని లీవుగా పరిగణించాలన్న తమ అభ్యర్థనను పరిశీలిస్తామని హామీ ఇచ్చారని లక్ష్మారెడ్డి తెలిపారు. ఏసీజే ఆదేశాల మేరకు తమ సమస్యలపై చర్చించేందుకు రిజిస్ట్రార్ (పరిపాలన) నాగార్జున  ఈనెల 14న సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు