కన్నతల్లిని వదిలించుకున్నారు!

21 Aug, 2016 21:45 IST|Sakshi
కన్నతల్లిని వదిలించుకున్నారు!
  • వృద్ధురాలిని బస్టాండ్‌లో వదిలేసిన బిడ్డలు 
  • ఊరికి వెళ్లొద్దామంటూ తీసుకొచ్చిన తనయలు
  • తిప్పాపూర్‌లో భిక్షాటన చేస్తున్న వృద్ధురాలు
  • తన గ్రామానికి పంపించండంటూ ఆవేదన 
  • వేములవాడ రూరల్‌ : కట్టుకున్న భర్త, కన్నకొడుకు కన్నుమూశారు. కోడలు, మనుమలు కాదుపొమ్మన్నారు. చివరకు కడుపున పుట్టిన బిడ్డలు సైతం కనికరించలేదు. తల్లికి తెలియకుండా ఊరికి వెళ్లొద్దామంటూ ఆటోలో ఊరుగాని ఊరు తీసుకొచ్చి వదిలేసిపోయారు. పది రోజులుగా కడుపుకు తిండిలేక, కంటికి కునుకు లేక ఆ అవ్వ బక్కచిక్కిపోతోంది. తనను బిడ్డల దగ్గరికి చేర్చాలంటూ కనిపించిన వారందరినీ ప్రాధేయపడుతోంది. అందరూ ఉండి అనాథగా మారిన వృద్ధురాలు ప్రస్తుతం వేములవాడలోని తిప్పాపురం బస్టాండ్‌లో బిక్కుబిక్కుమంటోంది. వృద్ధురాలు తెలిపిన వివరాల ప్రకారం ఆమె దీనగాథ ఇదీ... 
    ఆటోలో తీసుకొచ్చి వదిలేశారు... 
    ఆదిలాబాద్‌ జిల్లా చెన్నూరుకు చెందిన గడారి సాయమ్మ భర్త ఎల్లయ్య పదేళ్ల కిందట మృతి చెందాడు. వీరికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు సంతానం. కొడుకుతోపాటు ఒక కూతురు గత కొంతకాలం క్రితం చనిపోయారు. కోడలు, నలుగురు మనుమలు కరీంనగర్‌ జిల్లా జగిత్యాలలో ఉంటున్నారు. ఒక కూతురుకు వివాహమై వెళ్లిపోగా, మరో కూతురు వికలాంగురాలు. కొంతకాలం నుంచి సాయమ్మ వికలాంగురాలైన కూతురుతో కలిసి చెన్నూరులో నివాసం ఉంటోంది. వీరిద్దరు ప్రభుత్వం ఇచ్చే ఆసరా పింఛన్‌పైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఈ క్రమంలో సాయమ్మను సాకడం భారంగా భావించిన కుమార్తెలు ఆమెను వదిలించుకోవాలనుకున్నారు. పథకం ప్రకారం ఊరికి వెళ్లొద్దామంటూ పది రోజుల క్రితం ఆమెను ఆటోలో తీసుకొచ్చి వేములవాడ బస్టాండ్‌ వద్ద వదిలేశారు. ఏమీ తెలియని ఆ తల్లి ఇక్కడికి ఎందుకు వచ్చినం బిడ్డ అంటూ అమాయకంగా తన కూతుళ్లను అడిగింది. ఇక్కడ కొంత పని ఉందని, తాము ఆ పని చేసుకొని వస్తామని చెప్పి వారిద్దరు వచ్చిన ఆటోలో వెళ్లిపోయారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బిడ్డల కోసం ఎదురుచూసిన సాయమ్మ వారు రాకపోవడంతో తన బిడ్డల జాడ చెప్పాలంటూ అక్కడున్న వారిని అమాయకంగా అడగటం మెుదలుపెట్టింది. ఇలా ఒకటి, రెండు రోజులు అయినప్పటికీ ఆ బిడ్డలు రాలేదు. అప్పుడు ఆర్థమైంది.. బిడ్డలు తనను వదలించుకోవడానికే ఈ ప్రాంతానికి తీసుకొచ్చారని! ఎలాగైనా తనను బిడ్డల దగ్గరికి పంపించమంటూ ఆ వృద్ధురాలు గత పది రోజులుగా కనిపించిన వారందరినీ వేడుకుంటోంది. 
    దినదిన గండంగా... 
    పది రోజులుగా బస్టాండ్‌ ప్రాంతంలో ఉంటున్న సాయమ్మ పరిస్థితి దయనీయంగా మారింది. తినడానికి తిండి లేదు.. ఉందామంటే చోటు లేదు.. ఒంటిపై సరైన బట్టలు కూడా లేవు. స్థానిక ఆటోడ్రైవర్లు, ప్రయాణికులు, ఆలయానికి వచ్చే భక్తులు దయతల్చి ఇచ్చింది తింటూ ఆర్ధాకలితో అలమటిస్తోంది. రాత్రివేళ ఆటోస్టాండ్‌ వద్దనున్న షెడ్‌లో పడుకుంటోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు బస్టాండ్, మూలవాగు పక్కన ఉంటోంది. సాయమ్మకు కాళ్లు పనిచేయవు. నేలపై పాకుతూ కొద్దిదూరం కూడా కదల్లేకపోతోంది. భిక్షాటన చేయగా రూ.200 వచ్చాయని, ఈ డబ్బులు తీసుకొని తనను చెన్నూరులో వదలిపెట్టండని ఆటోవాలాలను వేడుకుంటోంది. విషయం తెలుసుకున్న సాక్షి విలేకరి సాయమ్మ గురించి వేములవాడ టౌన్‌సీఐ శ్రీనివాస్‌కు సమాచారం అందించగా, ఆమెను చెన్నూరుకు పంపించడానికి చర్యలు తీసుకుంటానని అన్నారు. కారణాలేవైనా... మలిసంధ్యలో ఉన్న ఇలాంటి అమాయక వృద్ధులను వారి కుటుంబసభ్యులే ఆ రాజన్న చెంతకు చేర్చడం, వారు ఇక్కడ భిక్షాటన చేస్తూ జీవించడం, ఆపై అనాథలుగా మరణించడం.. మానవతావాదులను కలిచివేస్తోంది. 
     
     
>
మరిన్ని వార్తలు