కర్నూలు(లీగల్): స్నేహితుడినే హత్యచేసిన కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ. 5వేల జరిమాన విధిస్తూ జిల్లా నాల్గవ అదనపు న్యాయస్థానం మంగళవారం తీర్పు చెప్పింది. కర్నూలు చిత్తారి గేరికి చెందిన షేక్ మహబూబ్బాషా గని గల్లికి చెందిన చౌదరి జహంగీర్ ఖురేషి స్నేహితులు. జహంగీర్ ఖురేషి తరచుగా మహబూబ్బాషా ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో మిత్రుడి అన్న కుమార్తెతో జహంగీర్ సంబంధం పెట్టుకున్నాడు.
విషయం తెలిసిన మహబూబ్బాషా తన అన్న కుమార్తెను వివాహం చేసుకోవాలని కోరాడు. అందుకు జహంగీర్ నిరాకరించడాన్ని మనసులో ఉంచుకుని 2013 జనవరి 5వ తేదీన అతడు స్థానిక జమ్మిచెట్టు సమీపంలో పేకాట ఆడుతుండగా దాడి చేసి హత్యచేశాడు. హతుడి అన్న చౌదరి ఇక్బాల్ ఖురేషి ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష విధిస్తూ న్యాయమూర్తి టి.రఘురాం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరుఫున పీపీ రాజేంద్ర ప్రసాద్ వాదించారు.