బుక్కరాయసముద్రం : జంట హత్యల కేసులో ఓపెన్ ఎయిర్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తూ పరారైన ఓ ఖైదీని బుక్కరాయసముద్రం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఇటుకులపల్లి సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ విలేకరులకు వెల్లడించారు. సోమందేపల్లి మండలం ఎస్.కొత్తపల్లికి చెందిన గొల్లమల్లికార్జున (44) మరో 5 మంది కలిసి 1999లో జంట హత్యలకు పాల్పడ్డారు. ఈ కేసుపై 2005లో హిందూపురం సెషన్ జడ్జి ఐదుగురికి జీవిత ఖైదు విధించారు.
వీటిలో శిక్షా కాలంలో ఒకరు చనిపోగా మిగిలిన ముగ్గురు సత్ప్రవర్తన కలిగి ఉన్నారని ప్రభుత్వం జీఓలో విడుదల చేసింది. మల్లికార్జున కడపలో ఐదేళ్లు శిక్ష పూర్తి చేసుకుని ఓపెన్ ఎయిర్ జైలుకు 2010 ఫిబ్రవరి 6న వచ్చాడు. అదే ఏడాది జూన్ 30న జైలు నుంచి తప్పించుకున్నాడు. నాటి నుంచి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు. బీకేఎస్ సీఐ రాజేంద్రనా«థ్ యాదవ్, ఎస్ఐ విశ్వనాథ్ చౌదరి ప్రత్యేక సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో సోమందేపల్లిలో ఉన్నాడనే విశ్వనీయ సమాచారంతో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. కార్యక్రమంలో ఏఎస్ఐ భాస్కర్, హెడ్ కానిస్టేబుల్ లక్ష్మినారాయణ, సంతోష్, రాము, కృష్ణ, పాల్గొన్నారు.