ఇందూరు టు మహారాష్ట్రకు కల్తీకల్లు!

7 Jul, 2016 04:31 IST|Sakshi
ఇందూరు టు మహారాష్ట్రకు కల్తీకల్లు!

సరిహద్దులో తిష్టవేసిన ‘బాసర బ్యాచ్’
‘మిషన్ బాసర’తో జిల్లాకు ‘మాఫియా’
యంచలో రూ.12 లక్షలకు డిపో కొనుగోలు
రైలుమార్గంలో భారీగా కల్తీ కల్లు రవాణా
ఫకీరాబాద్, నాగేపూర్‌ల నుంచి సరఫరా
ఎక్సైజ్, పోలీసుశాఖల మౌనం

జిల్లాలో కల్తీ కల్లు ఏరులై పారుతోంది.. జిల్లాలో విక్రయాలు చాలవన్నట్లు మహారాష్ర్ట నుంచి రైళ్లలో కల్లు ముడిసరుకులు తెప్పించుకుంటూ.. మళ్లీ మహారాష్ర్టకు కల్లు సరఫరా చేస్తున్నారు. బాసర బ్యాచ్‌గా పిలవబడే ఈ కల్లు మాఫియాను పోలీసులు, ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏకంగా యంచలో రూ.12 లక్షలతో డిపోను కొనుగోలు చేశారంటే అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ఫకీరాబాద్, నాగేపూర్‌ల నుంచి కల్లీ కల్లు సరఫరా అవుతోంది..

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ :  కల్తీ కల్లు చిమ్ముతున్న విషానికి పదుల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలుస్తున్నా.. అధికారులు కళ్లు తెరవడం లేదు. కల్తీకల్లు రహిత జిల్లాగా మారుస్తామంటున్న ఎక్సైజ్‌శాఖ తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో నవీపేట మండలం యంచ, ఫకీరాబాద్, నాగేపూర్‌లలో యథేచ్ఛగా సాగుతున్న కల్తీకల్లు తయారీని పట్టించుకోవడం లేదు. ‘మిషన్ బాసర’తో అక్కడ దందాను వదిలి.. కల్లు దందాలో ఆరితేరిన ‘బాసర బ్యాచ్’ రూ.12 లక్షలకు యంచలో డిపోను కొనుగోలు చేసింది.

యంచ కల్లు డిపో కేంద్రంగా నిషేధిత మత్తు పదార్థాలతో కల్లు తయారు చేసి ప్యాకెట్ల రూపేణా రోజుకు వేల లీటర్లు మహారాష్ట్రకు తరలిస్తున్నారు. యంచతోపాటు ఫకీరాబాద్, నాగేపూర్‌ల నుంచి తరలుతున్న కల్లీ కల్లు ఫకీరాబాద్ తోపాటు ఆదిలాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చే బాసర రైల్వేస్టేషన్ నుంచి మహారాష్ర్టకు తరలుతుంది. యంచ డిపోను కొనుగోలు చేసి దందా నడిపిస్తున్న నిర్వాహకుని తండ్రిని ఐదు కిలోల క్లోరల్ హైడ్రేడ్, 25 కిలోల కల్లు తయారీకి ఉపయోగించే ఇతర ముడి సరుకులను పట్టుకున్న ఆబ్కారీశాఖ అధికారులు.. ఆ తర్వాత అటువైపు చూడటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. నాలుగు నెలలుగా జిల్లాకు చెందిన మరో ఇద్దరిని కలుపుకుని ‘బాసర బ్యాచ్’ కొనసాగిస్తున్న కల్లుదందా రూ.లక్షలు కురిపిస్తుండగా.. పోలీసు, ఎక్సైజ్‌శాఖలు మౌనం వహించడం చర్చనీయాంశం అవుతోంది.

‘మిషన్ బాసర’తోజిల్లాలో కల్లు మాఫియా తిష్ట
ఆదిలాబాద్ జిల్లా బాసర కేంద్రంగా కల్తీకల్లు దందా నిర్వహించి రూ.కోట్లు గడించిన కల్లు మాఫియా జిల్లాలో మకాం వేసింది. సుమారు ఐదు మాసాల క్రితం బాసరకు చెందిన యువత, సామాజిక కార్యకర్తలు సరస్వతి దేవి కొలువున్న చోట కల్తీ కల్లు, మద్యం విక్రయాలు చేయరాదంటూ ‘మిషన్ బాసర’కు శ్రీకారం చుట్టాయి. కల్తీకల్లు దందా సర్వస్వంగా మారిన ‘బాసర బ్యాచ్’ జిల్లాలోని నవీపేట మండలం యంచ డిపోను రూ.12 లక్షలు స్థానిక నిర్వాహకులకు చెల్లించి హస్తగతం చేసుకుంది. పాత పద్ధతిలోనే మహారాష్ట్రలోని ధర్మాబాద్ నుంచి నవీపేట మండలం యంచ, ఫకీరాబాద్‌లకు కల్లు తయారీకి ఉపయోగించే మత్తు పదార్థాలు తెచ్చుకుంటున్నా పోలీసులు, ఎకై ్సజ్ అధికారులు పట్టించుకోవడం లేదు.

క్రిమి సంహారక మందుల తయారీకి ఉపయోగించే రసాయనాలను ధర్మాబాద్ నుంచి కొనుగోలు చేసి కల్తీ కల్లు తయారు చేస్తూ.. తిరిగి ప్రాంతాలకే సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుతున్నారు. డైజోఫాం, క్లోరల్ హైడ్రేడ్, క్లోరోఫాంలు (మత్తుకోసం), శక్రీన్ (రుచి కోసం), తెల్లపౌడర్ (చిక్కదనం కోసం), కుంకుడు కాయల రసం(నురుగు కోసం)లు కలిపి కల్లు తయారు చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఇంతగా కల్తీకల్లు తయారీ, విక్రయాల దందా సాగుతుంటే ఎకై ్సజ్ అధికారులు మాత్రం గోల్లుగిల్లుకుంటున్నారు. పేదల పాలిట కాలయముల్లా తయారైన కల్తీ కల్లు వ్యాపారులంటే అధికార యంత్రాంగానికి అపారమైన ప్రేమ ఉంటుంది.

‘‘ఒత్తిడి ఎక్కువైతే అప్పుడప్పుడు కల్లును ఒలకబోస్తారే తప్పా.. వారిపై ప్రేమ ఒలకబోయకుండా ఉండరన్న’’  విమర్శలు ఉన్నాయి. ఇదిలా వుంటే ధర్మాబాద్ నుంచి మత్తు పదార్థాలు తెచ్చి యంచ, ఫకీరాబాద్, నాగేపూర్‌లు కేంద్రంగా కల్తీ కల్లు తయారు చేస్తున్న నిర్వాహకులు రైలుమార్గం ద్వారా మహారాష్ర్టలోని పల్లెలకు సరఫరా చేస్తున్నా ఎకై ్సజ్, పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి.

కల్లు మాఫియాకు వరంగా రైలుమార్గం
బాసరలో కల్లు దందా జోరుగా నిర్వహించిన కల్లు మాఫియా ఇప్పుడు జిల్లా సరిహద్దులో మకాం వేయగా.. అప్పుడు, ఇప్పుడు మహారాష్ట్ర పేద మహిళలే ‘బాసర బ్యాచ్’కు టార్గెట్. ‘తక్కువ ధర’ పేరిట కల్లు ప్యాకెట్లను తయారు చేసి మహిళలతో ఈ ప్యాకెట్లను మహారాష్ట్రకు సరఫరా చేస్తున్నారు. రైలుమార్గం ఈ కల్లు మాఫియాగా వరంగా మారింది. యంచతోపాటు ఫకీరాబాద్, నాగేపూర్ గ్రామాలలోని కల్లు బట్టీల నుంచి మహారాష్ట్రలోని ధర్మాబాద్, నాందేడ్, ముద్‌కెడ్, జల్నా తదితర ప్రాంతాలకు కల్లు సరఫరా అవుతుంది. ఫకీరాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్యాసింజర్ రైలు ఆగుతుంది. ఈ రైళ్లలోనే సరఫరా ముఠాలు కల్లును సరఫరా చేస్తున్నాయి.

యువకులు, మహిళలు, పిల్లలు, వృద్ధులు రైళ్లలో ఇక్కడ దిగి, ప్యాకెట్లలో కల్లును నింపుకుని మళ్లీ మరొక రైలులో వెళ్తున్నారు. ఈ స్టేషన్ మీదుగా అయిదు ప్యాసింజర్ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. వీరి కోసం కల్లు బట్టీలలో ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. రైలు ఆగిందంటే వీరి రాక కోసం కల్లు బట్టీల నిర్వాహకులు ఎదురుచూస్తారు. ఒక్కో వ్యక్తికి 30 నుంచి 50 ప్యాకెట్లను ఇచ్చి వారికి ఒక్కొక్కరికీ రోజుకు రూ.300 నుంచి రూ.500 వరకు గిట్టుబాటు కలిగేలా వ్యాపారులు చూసుకుంటున్నారు. ‘బాసర బ్యాచ్’కు అందరినీ కలుపుకుని ఈ దందా సాగిస్తుండగా యంచ, ఫకీరాబాద్, నాగేపూర్‌ల నుంచి రోజుకు పెద్ద ఎత్తున మహారాష్ర్టకు కల్తీ కల్లు రవాణా అవుతోంది.

 కల్లు డిపోలపై ప్రత్యేక బృందాల దాడి శాంపిల్స్ సేకరించిన అధికారులు
నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని కల్లు డిపోలపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక బృందాలు బుధవారం దాడులు నిర్వహిం చాయి. డిపోలో తయారైన కల్లు శాంపిళ్లను సేకరించాయి. కల్తీ కల్లు నివారణ చర్యల్లో భాగంగా ఎక్సైజ్ శాఖ జిల్లా ఇన్‌చార్జి డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్ ఆదేశాల మేరకు ఈఎస్ టాస్క్‌ఫోర్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మిక దాడులు చేశా రు. నిజామాబాద్‌కు చెందిన సిబ్బంది కా ్జజీండా ఆర్మూర్, మోర్తాడ్ స్టేషన్లకు చెందిన ఎక్సైజ్ సిబ్బందితో ఈ దాడులు చేయిం చడం విశేషం.

 నిజామాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల నిజామాబాద్ మండలం గూపన్‌పల్లి, మాధవనగర్, బోర్గాం (పీ) కల్లు డిపోలపై ఈ దాడులు జరిగాయి. ఆయా డిపోల్లో తయారైన కల్లు శాంపిల్స్‌ను అధికారులు సేకరించారు. నిజామాబాద్ నగరంలో ఒకటి, రెండో కల్లు డిపోల లెసైన్స్‌లు రద్దు కావటంతో కల్లు ప్రియులు నిజామాబాద్ నగర ం చుట్టు పక్కల గ్రామాలకు వెళ్లి కల్లు సేవించడమే కాకుండా, ఇంటికి ప్యాకెట్లలో తెచ్చుకుంటున్నారు. దాంతో ఆయా కల్లు డిపోలు అధికంగా లాభాలు ఆర్జిస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని, డిపో నిర్వాహకులు కల్లును మరింత ఎక్కువ తయారు చేసి విక్రయించేందుకు కల్లులో ఏమైనా మత్తుపదార్థాలు కలుపుతున్నారా అన్న అనుమానంతో ఇన్‌చార్జి డీసీ టాస్క్‌ఫోర్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలతో తనిఖీలు చేయించారు. డిపోలలో తయారైన కల్లు శాంపిల్స్‌ను సేకరించి వాటిని ల్యాబ్‌కు పంపారు. కల్లులో ఏమైనా మత్తు పదార్థా లు కలిపినట్లుగా పరీక్షల్లో తేలితే నిర్వాహకులపై చర్యలు తీసుకోనున్నారు.

మరిన్ని వార్తలు