– ఆర్టీసీ ఈడీ రామారావు
కర్నూలు (రాజ్విహార్): ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే రూట్లలో తగిన సంఖ్యలో బస్సులు నడపాలని రోడ్డు రవాణ సంస్థ కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు రామారావు సూచించారు. ఆదివారం స్థానిక కొత్త బస్టాండ్లోని రీజినల్ మేనేజరు కార్యాలయంలో 2017–18 వార్షిక ప్రణాళికపై స్థానిక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా సంస్థణు నష్టాలు వెన్నాడుతున్నాయని, వీటిని తగ్గించుకునేందుకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఆదాయ మార్గాలు అన్వేషించి ఖర్చులను తగ్గించుకోవాలని చెప్పారు. గత ఏడాది 12.80కోట్ల కిమీ మీటర్లు బస్సులు తిప్పామని, ఈ ఏడాది 12కోట్ల కిలో మీటర్లు నడిపేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డీసీటీఎం, కర్నూలు, ప్రొద్దుటూరు, డోన్ డీఎంలు పాల్గొన్నారు.