మరదలితో పెళ్లికి భార్య ఒప్పుకోలేదని..

6 Apr, 2016 13:49 IST|Sakshi
మరదలితో పెళ్లికి భార్య ఒప్పుకోలేదని..

ప్రేమ విఫలమైన కారణంగా ఓ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రియుడు కన్నుమూశాడు. ప్రియురాలు ఆసుపత్రిలో చికిత్సపొంతుతోంది. పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. అయితే దర్యాప్తులో అనూహ్యమైన విషయాలు వెలుగులోకివచ్చాయి. చనిపోయిన ప్రియుడు చికిత్సపొందుతున్న యువతి అక్క భర్త అని తేలింది. ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ట్రయాంగిల్ లవ్ కమ్ క్రైమ్ స్టోరీ వివరాల్లోకి వెళితే..

చెన్నూరు మండలం చెళ్లాయిపేటకు చెందిన తిరుపతి అనే యువకుడికి అదే గ్రామానికి చెందిన యువతితో రెండేళ్ల క్రితం వివాహమైంది. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరి కుటుంబంలో మరదలి(18) రాకతో కష్టాలు మొదలయ్యాయి. మరదలు వచ్చినప్పటి నుంచి ఆమెతోనే సన్నిహితంగా ఉంటూ భార్యను నిర్లక్ష్యం చేయసాగిన తిరుపతి.. చివరికి మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తన చెల్లితో భర్త సంబంధం పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన తిరుపతి భార్య.. కుల పెద్దలను పిలిచి పంచాయితీ పెట్టించింది.

చావనైనా చస్తానుగానీ, భర్త మరొకరితో ఉండటం చూడలేనని పెద్దల ముందు రోదించింది తిరుపతి భార్య. అప్పటికే మరదలితో పీకలోతు ప్రేమలో మునిగిపోయిన తిరుపతి.. జరిగిన పరిణామాలతో మనస్తాపానికి గురై మరదలితో కలిసి గతనెల 29న కరీంనగర్ జిల్లా మంథనికి వెళ్లాడు. అక్కడ ఇద్దరూ పురుగుల మందు సేవించి ఆత్మహత్యయత్నం చేశారు. అపస్మారక స్థితిలో పడిఉన్న జంటను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. చికిత్స పొందుతూ తిరుపతి బుధవారం ప్రాణాలు కోల్పోయాడు. యువతి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు