ప్రియురాలి మౌన పోరాటం

9 Sep, 2017 09:28 IST|Sakshi
ప్రియుడి ఇంటి ఎదుట మౌన పోరాటానికి దిగిన నాగమణి

ప్రేమించుకున్నారు.. పెళ్లాడాలనుకున్నారు.
పెద్దలకు తెలిసింది.. అభ్యంతరం చెప్పలేదు.
కలిసి తిరిగారు.. కలిసి ఉన్నారు.
మోజు తీరిందేమో..ఆమెకు దూరమయ్యాడు..
మరొకామెకు దగ్గరయ్యాడు.
మోసపోయిన ఆ ప్రియురాలు..
మౌన పోరాటానికి దిగింది.


ఇల్లెందు:
‘‘ఒకటి కాదు.. రెండు కాదు. మాది 12 ఏళ్ల ప్రేమ. ఇన్నేళ్లపాటు కలిసి తిరిగాం. కాబోయే దంపతులమని నమ్మాను. దగ్గరయ్యాను. రెండుసార్లు గర్భవతినయ్యాను. అబార్షన్‌ చేయించాడు. ఇప్పుడు.. కాదు పొమ్మంటున్నాడు’’ – ఇది ఓ ప్రియురాలి ఆవేదన.

ఆమె పేరు సిలివేరు నాగమణి. ఇల్లెందు పట్టణంలోని గోవింద్‌ సెంటర్‌ నివాసి. అతడి పేరు శేషు. కారు డ్రైవర్‌. స్థానిక సాయిబాబా టెంపుల్‌ ఏరియా నివాసి.
12 ఏళ్ల క్రితం సాయిబాబా టెంపుల్‌ సమీపంలో టైలరింగ్‌ సెంటర్‌లో ఆమె చేరింది. అదే ప్రాంతానికి చెందిన కార్‌ డ్రైవర్‌ శేషుతో పరిచయమేర్పడింది. అది ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలనుకున్నారు.
రెండు కుటుంబాల్లోని పెద్దలకు విషయం తెలిసింది. అభ్యంతరం చెప్పలేదు. అంగీకారం తెలిపారు.
అప్పటి నుంచి ఆ ప్రేమికులు ఖుషీ ఖుషీగా తిరిగారు. తనువులు దగ్గరయ్యాయి.
ఆమె రెండుసార్లు గర్భవతయింది. అతడు బలవంతంగా అబార్షన్‌ చేయించాడు.
వారు పెళ్లి చేసుకోలేదు. కానీ, ఆమెను తనను భార్యగా పేర్కొంటూ రేషన్‌ కార్డులో పేరును కూడా నమోదు చేయించాడు.
ఆమెపై మోజు తీరిందేమో! ఇటీవల మరో యువతితో వివాహేతర సంబంధం సాగిస్తున్నాడు. ప్రియురాలిని దూరం పెడుతున్నాడు.
ఆమె గ్రహించింది. నిలదీసింది. పెళ్లి చేసుకుందామని మరోమారు ఆమెను నమ్మించాడు.
పాపం.. ఆ అమాయకురాలు మరోసారి గుడ్డిగా నమ్మింది. ఆమె కుటుంబ పెద్దలు అతడి ఇంటికి వెళ్లి కట్నకానుకలు కూడా మాట్లాడుకున్నారు. అతడు మాత్రం ఆమెకు దూరం దూరంగా ఉంటున్నాడు. ఫోన్‌ చేస్తే.. ‘‘నువ్వెవరో నాకు తెలియదు’’ అన్నాడు.
తాను మోసపోయినట్టుగా తెలుసుకుంది. దిక్కుతోచలేదు. తన బస్తీ వాసులు కొందరి అండతో ప్రియుడి ఇంటి ముందు శుక్రవారం టెంట్‌ వేసుకుని, దాని కింద కూర్చుంది. మౌన పోరాటానికి దిగింది. న్యాయం కోసం మౌనంగా, దీనంగా రోదిస్తోంది. ఆ ఇంటిలో శేషు లేడు. ఎక్కడికో వెళ్లిపోయాడు.
పోలీస్‌ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. దీక్షకు దిగిన ఆమె వద్దకు ఎస్‌ఐ కొమురెల్లి వెళ్లారు. అందరి నుంచి వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేస్తున్నట్టు చెప్పారు.

మరిన్ని వార్తలు