ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

24 May, 2016 18:21 IST|Sakshi
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పట్టణంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ  ఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మెదక్ జిల్లా సంగారెడ్డికి చెందిన శ్రీమాన్(21), శివాణి (20) ఆదివారం ఉదయం 11గంటలకు గుట్ట పట్టణంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో బస చేశారు.
 
 సాయంత్రం యాదాద్రి కొండపైకి వెళ్లి శ్రీ లక్ష్మీ నర్సింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం వారు ఉన్న గదిలో రాత్రి నిద్ర చేశారు. సోమవారం తెల్లవారుజామున ఆ ప్రేమికులు ఫినాయిల్‌ను తాగి అపస్మారకస్థితిలో పడి ఉన్నారు. గమనించిన లాడ్జి నిర్వహకులు పోలీసులకు, 108 వాహన సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
 
  వెంటనే శ్రీమాన్, శివాణిలను చికిత్స నిమిత్తం తొలుత భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వారు కోలుకుంటున్నట్టు తెలిసింది. ఈ విషయమై ఇరు కుటుంబాల సభ్యులకు చెప్పి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.
 

మరిన్ని వార్తలు