లక్‌.. కిక్‌.. ఐటీ లుక్‌

9 Apr, 2017 00:50 IST|Sakshi
తణుకు : అదృష్టంతో దుకాణాలు దక్కాయని సంబరపడుతున్న మద్యం వ్యాపారుల కిక్కు దించేందుకు ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. రూ.లక్షలు పోసి మద్యం దుకాణాలు దక్కించుకున్నవారు సంతో షంగా ఉండగా దరఖాస్తు చేసి దుకా ణాలు రానివారు నిరాశతో ఉన్నారు. వీరిద్దరిపై ఐటీ అధికారులు దృష్టి సారించారు. ఆర్థిక సంవత్సరం ముగింపురోజున మద్యం దుకాణాల నిర్వహణకు సంబంధించి జరిగిన సుమారు రూ.100 కోట్ల లావాదేవీలపై అధికారులు కన్నేశారు. ఇప్పటికే తాజాగా మద్యం దుకాణాలు దక్కించుకున్న వ్యాపారుల జాబితాను సేకరించిన అధికారులు వారి ఆదాయ మార్గాలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు దరఖాస్తు చేసుకుని దుకాణాలు దక్కించుకోలేకపోయిన వారి వివరాలను సైతం సేకరించడంతో ఇప్పుడు ఆయా వర్గాల్లో ఆందోళన నెలకొంది. 
 
రూ.100 కోట్ల లావాదేవీలు
జిల్లాలో 2017–19కు సంబంధించి మొత్తం 474 మద్యం దుకాణాలకు ఎక్సై జ్‌ అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు. లైసెన్స్‌ ఫీజు దాదాపు 75 శాతం మేర తగ్గించడంతో 9,364 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు, రిజిస్ట్రేషన్‌ రుసుం దుకాణం వచ్చినా, రాకపోయినా తిరిగి చెల్లించే అవకాశం లేదు. దీని ప్రకారం ఒక్కో దరఖాస్తుదారుడు సగటున రూ.60 వేలు చొప్పున సుమారు రూ.50 కోట్ల లావాదేవీలు జరిపారు. దుకాణం దక్కించుకున్న వ్యాపారులు షాపునకు రూ.11.50 లక్షలు చొప్పున ప్రభుత్వానికి చెల్లించారు. ఈ లెక్కన జిల్లాలో మద్యం వ్యాపారులు సుమారు రూ.100 కోట్ల మేర లావాదేవీలు జరిపినట్టు తెలుస్తోంది. ఫలితంగా మద్యం వ్యాపారుల మెడకు ఐటీ ఉచ్చు బిగించడం ఖాయంగా కనిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకు, నగదు లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రూ.2 లక్షలు పైబడి బ్యాంకు ఖాతాల్లో నిల్వ ఉంటే దానికి లెక్కలు చెప్పాలనే నిబంధనలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మద్యం దుకాణాలకు టెండర్లు వేసిన వారిలో చాలా మంది వ్యాపారులు తమ బంధువులు, సన్నిహితుల (పాన్‌కార్డు ఉన్నవారి) పేరుతో దరఖాస్తు చేశారు. దీంతో ఒక్కో వ్యక్తికి అప్పటికప్పుడు రూ.లక్షల నగదు ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో ఆదాయపు పన్నుశాఖ అధి కారులు దృష్టి సారించారు. బ్యాంకు ఖాతాల్లో లావాదేవీలను చూపిం చారా..? ఆయా మొత్తాలకు రిటర్న్‌ దాఖలు చేశారా..? అనే అంశాల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు ఆర్థిక సంవత్సరం ముగింపు రోజు మార్చి 31న జరిగిన కోట్లాది రూపాయల లావాదేవీలు నల్లధనంగా అధికారులు భావిస్తున్నారు. 
 
మరిన్ని వార్తలు