లక్కీడిప్‌ నిర్వహకుల అరెస్‌​‍్ట

10 May, 2017 23:42 IST|Sakshi
 
ఆత్మకూరు: వెలుగోడు మండలం అబ్దుల్లాపురం గ్రామ సమీపంలో జమ్ములమ్మ గుడివద్ద లక్కీడిప్‌ నిర్వహకులను అరెస్టు చేసినట్లు ఆత్మకూరు డీఎస్పీ వినోద్‌కుమార్‌ తెలిపారు. పట్టణంలోని సీఐ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. అనుమతులు లేకుండా శ్రీలక్ష్మీ వేంకటేశ్వర ఎంటర్‌ ప్రైజస్‌, లక్ష్మీ నరసింహ ఎంటర్‌ ప్రైజస్‌లను అనంతపురానికి చెందిన లక్ష్మీరెడ్డి, శ్రీపతిరావు పేటకు చెందిన  ప్రభాకర్‌రెడ్డిలు ఏర్పాటు చేశారన్నారు. కొద్ది మంది ఏజెంట్లను నియమించుకొని లక్కీడిప్‌ నిర్వహిస్తున్నారన్నారు. సమాచారం రావడంతో దాడిచేసి నిర్వాహకులను అరెస్ట్‌ చేశామన్నారు. వారి వద్ద నుంచి రూ.55,000 నగదు, రెండు మోటార్‌ సైకిళ్లు, ఒక ఇండికా విస్టా కారు, ఐదు సెల్‌ఫోన్లు, ఒక రోలింగ్‌ మిషన్‌, నాలుగువేల టోకెన్స్‌, 22 రశీదు పుస్తకాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఏజెంట్లు సాంబశివరావు, హుస్సేన్‌, సుబ్బారావు, రాముడులను కూడా అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచామన్నారు. దాడుల్లో  సీఐ కృష్ణయ్య, వెలుగోడు ఎస్‌ఐ ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
 
మోసపోవద్దు...
లక్కీడిప్‌లతో మోసపోవద్దని, ఎక్కడైనా ఇలాంటి ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని ఆత్మకూరు డీఎస్పీ వినోద్‌కుమార్‌ సూచించారు. శ్రీలక్ష్మీ వేంకటేశ్వర ఎంటర్‌ ప్రైజస్‌, లక్ష్మీ నరసింహఎంటర్‌ ప్రైజస్‌ ద్వారా 9వేల మందితో రూ. 3కోట్లకు పైగా వసూలు చేసినట్లు తమ విచారణలో బయటపడిందన్నారు. ఆత్మకూరు ప్రాంతంలో కూడా ఇలాంటి ఉన్నాయని, వాటిపై దృష్టి సారించామన్నారు. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
 
మరిన్ని వార్తలు