మాధురి.. ఉద్యమ దీప్తి

16 Jul, 2016 20:05 IST|Sakshi
మాధురి.. ఉద్యమ దీప్తి

అందరిలానే ఆమె ఈ భూమిపైకి వచ్చింది. ఎదుగుతుండగా ప్రకృతి సిద్ధంగా వచ్చిన లోపాలను గుర్తించింది. తాను  ప్రత్యేకంగా ఉన్నానని గమనించింది. ఆ మేరకు తన పేరును రాజశేఖర్‌గౌడ్‌కు బదులుగా మాధురిగా మార్చుకుంది.
ప్యాంటూ, షర్ట్‌ బదులుగా లంగా, ఓణి, గాగ్రాచోలీ, పంజాబీ డ్రెస్‌లు వేయడం ప్రారంభించింది. మొదట్లో ఆమె వ్యవహార  శైలిని కుటుంబసభ్యులతో పాటు ఉపాధ్యాయులు, పలువురు విద్యార్థులు వ్యతిరేకించారు. ఆమె నుంచి ఎవరికీ  ఇబ్బంది లేకపోవడంతో  చదువుకోవడానికి ప్రోత్సహించారు. డిగ్రీ పరీక్షలు రాసేందుకు నిరాకరించగా పోరాడి  సాధించుకుంది. ఇప్పుడు పీజీ అడ్మిషన్‌నూ నిరాకరిస్తున్నారు. ఆమెతో ఉన్న సమాజం మారి ప్రోత్సహిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. హిజ్రాలకు విద్య, ఉద్యోగ అవకాశం కోసం మాధురి ఉద్యమం  ప్రారంభిస్తోంది.



కర్నూలు : మిడుతూరు మండలం వీపనగండ్ల గ్రామానికి చెందిన కె. మాధురి(రాజశేఖర్‌గౌడ్‌) తల్లిదండ్రులతో పాటు  అక్క, అన్న ఉన్నారు. ఆమె 7వ తరగతి వరకు స్వగ్రామంలోనే చదువుకుంది. 8 నుంచి 10వ తరగతి వరకు  మిడుతూరులోని గాం«ధీ మెమోరియల్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అభ్యసించింది. ఆ తర్వాత ఇంటర్‌ మీడియట్,  డిగ్రీలను నందికొట్కూరులోని సాయిరామ్‌ డిగ్రీ కళాశాలలో పూర్తి చేసింది. అయితే బాల్యం నుంచే మగపిల్లలకన్నా  ఆమె ఆడపిల్లలతోనే ఎక్కువగా ఆడుకునేది. టీనేజి వయస్సు వచ్చాక అమ్మాయి లక్షణాలు కనిపించాయి. అప్పటి  నుంచి ఆమె స్త్రీలు ధరించే వస్త్రాలు ధరించడం మొదలుపెట్టింది. ఈ దశలో మొదట్లో పాఠశాల ఉపాధ్యాయులు  వ్యతిరేకించినా తర్వాత ఆమె నుంచి ఎవ్వరికీ ఇబ్బంది లేకపోవడంతో అనుశాలు కల్పించేందుకు జీవోలు జారీ  మతించారు. పదో తరగతి చదువుతుండగానే ఆమె ముంబయి వెళ్లి లింగమార్పిడి ఆపరేషన్‌ చేయించుకుంది. ఇది  తెలిసి ఆమె తండ్రి రెండేళ్ల వరకు మాట్లాడటం మానేశారు. ఆ తర్వాత అర్థం చేసుకుని ఆమె అభివృద్ధికి ప్రోత్సాహం  అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె తల్లిదండ్రుల వద్దే స్వగ్రామంలో నివసిస్తోంది.

డిగ్రీ పరీక్షలు రాసేందుకు నిరాకరణ
డిగ్రీలో చేరేందుకు కళాశాల యాజమాన్యం అనుమతించలేదు. దీంతో ఆమె రాయలసీమ యూనివర్సిటీ  అధికారులతో పాటు లోక్‌అదాలత్‌ కోర్టును ఆశ్రయించింది. 8–2–2011 తేదిన జారీ చేసిన జీవో ఎంఎస్‌ నెం. 653 ప్రకారం  ఆమెకు విద్యాభ్యాసం చేసేందుకు అనుమతివ్వాలని కోర్టు మందలించింది. దీంతో మాధురి డిగ్రీ పరీక్షలు  రాయగలిగింది.

పీజీ అడ్మిషన్‌ కోసం ఉద్యమం
డిగ్రీ పూర్తి చేసుకున్న మాధురి ఆపై పీజీ చేయాలని కలలు కంది. 2015, 2016లలో వరుసగా రెండుసార్లు పీజీ సెట్‌  పరీక్ష రాసి మంచి ర్యాంకును తెచ్చుకుంది. అయితే ఆమెను అడ్మిషన్‌ సమయంలోనే యూనివర్సిటీ అధికారులు  నిరాకరించారు. మేల్‌గా సీటిస్తాము గానీ ట్రాన్స్‌జెండర్‌(హిజ్రా)కు ఇవ్వలేమని తెగేసి చెప్పారు. దీంతో తనకు ఉన్నత  విద్యాభ్యాసం చదువుకునేందుకు అనుమతివ్వాలని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితోపాటు స్థానిక ఎమ్మెల్యే  ఐజయ్య, జెడ్పీ చైర్మన్‌ మల్లెల రాజశేఖర్‌గౌడ్, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ను కలిసి విన్నవించినా ఫలితం  లేకపోయింది. ఎవరి వద్దకు వెళ్లినా ప్రయత్నం చేస్తామని చెప్పడమే గానీ ఆమె పోరాటానికి ఫలితం దక్కడం లేదు.  ప్రభుత్వం జీవో చేస్తే తప్ప తామేమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. ఇందుకోసం తాను ఉద్యమం చేయడానికి  సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. తనకు సీటు రాకపోయినా తనలాంటి వారికోసమైనా పోరాటం చేస్తానని ఆమె  చెబుతోంది.

సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కావాలన్నదే లక్ష్యం
'సబ్‌ ఇన్‌స్పెక్టర్‌  కావాలన్నదే నా లక్ష్యం. ఇందుకు ప్రతిరోజూ గ్రామంలో రన్నింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నాను. నాపై ఎవరూ  వివక్ష చూపడం లేదు. నన్ను ప్రోత్సహిస్తున్నారు. అలాగే ప్రభుత్వమూ స్పందించాలి. నాకు ఓటుహక్కుతో పాటు  ఆధార్‌కార్డు ఉంది. ఓటు వేసే హక్కు ఉన్నప్పుడు విద్య, ఉద్యోగ అవకాశాలు ఎందుకు కల్పించరు. కేంద్ర ప్రభుత్వంతో  పాటు తమిళనాడు ప్రభుత్వమూ మాలాంటిæ వారికి విద్య, ఉద్యోగాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయి. అలాగే రాష్ట్ర  ప్రభుత్వమూ సహకరించి ఆదుకోవాలి' అని చెబుతోంది మాధురి.
 

మరిన్ని వార్తలు