సూర్యాపేట:
రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్లాలని కారు అద్దెకు తీసుకున్న వ్యక్తి మార్గమధ్యలో డ్రైవర్పై దాడి చేసి కారుతో సహా పరారయ్యాడు. ఈ సంఘటన సూర్యాపేట శివారులో గురువారం తెల్లవారుజామున వెలుగుచూసింది. బుధవారం రాత్రి రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్లాలని ఓ వ్యక్తి ఇన్నోవా కారును అద్దెకు తీసుకున్నాడు. వాహనం సూర్యాపేట వద్దకు రాగానే డ్రైవర్ను కారు ఆపమని చెప్పి కిందకు దిగి బండరాయితో అతని పై దాడి చేసి ఇన్నోవాతో ఉడాయించాడు.
ఇది గుర్తించిన స్థానికులు డ్రైవర్ ఆరిఫుద్దీన్ను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ సునితా మోహన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.