ఉద్యోగం కోసం కన్నవారిని కడతేర్చాడు!

4 Mar, 2016 19:43 IST|Sakshi

సంగారెడ్డి మున్సిపాలిటీ (మెదక్) : ప్రభుత్వ ఉద్యోగం కోసం తల్లిదండ్రులతో పాటు మేనల్లుడిని సైతం పొట్టనబెట్టుకున్న నిందితుడికి యావజ్జీవ కారగార శిక్షతోపాటు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ మెదక్ జిల్లా జడ్జి ఎంవీ రమణ నాయుడు తీర్పు చెప్పారు. మెదక్ జిల్లా బీహెచ్‌ఈఎల్ పరిశ్రమలో సుధాకర్ రెడ్డి ఉద్యోగం చేస్తూ టౌన్ షిప్‌లో జీవనం సాగిస్తున్నాడు. ఆయన కుమారుడు ప్రవీణ్‌రెడ్డి చిల్లరిగా తిరుగుతూ అప్రయోజకునిగా మారాడు. ప్రభుత్వ ఉద్యోగం ఉంటే జీవితం సాఫీగా సాగుతుందని స్నేహితులు సలహా ఇచ్చారు. దీంతో ప్రవీణ్ ప్రభుత్వ ఉద్యోగం సంపాదించేందుకు రకరకాల ప్లాన్‌లు వేశాడు. ఏవీ పారకపోవటంతో చివరికి తండ్రిని చంపేసి ఆయన ఉద్యోగంలో చేరిపోవాలని కుట్రపన్నాడు.

ఇందుకోసం 2013 అగస్టు 28న తల్లిదండ్రులు, మేనల్లుడు మణికంఠరెడ్డి ఇంట్లోని ఓ గదిలో నిద్రిస్తుండగా వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బయటకు రాకుండా తలుపులకు గడియ వేశాడు. చనిపోయారని భావించిన తరువాత అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయాలన్నీ పోలీసు విచారణలో తేలాయి. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష తోపాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించారు.

మరిన్ని వార్తలు