గూడూరు (చిలకలపూడి) : విద్యుదాఘాతంతో ఇంట్లో మంటలు వ్యాపించగా అనారోగ్యంతో మంచానికే పరిమితమైన యువకుడు సజీవ దహనమయ్యాడు. ఈ సంఘటన కృష్ణాజిల్లా గూడూరు మండలం మల్లవోలు శివారు కుమ్మరిపాలెం గ్రామంలో సోమవారం జరిగింది. తల్లి కూలిపనుల నిమిత్తం పొలం వెళ్లగా చుట్టూ మంటలు వ్యాపిస్తున్నా లేవలేని స్థితిలో ఉన్న మడమల గంగరాజు (35) అగ్నికీలల్లో చిక్కుకుని మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం కుమ్మరిపాలెం గ్రామానికి చెందిన మడమల గంగరాజుకు తవిసిపూడి గ్రామానికి చెందిన అనంతదేవితో తొమ్మిది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. గంగరాజుకు అనారోగ్యం చేయటంతో ఏడేళ్ల కిందట భార్య వదిలి వెళ్లిపోయింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అప్పటి నుంచి గంగరాజు తన తల్లి వెంకటసుబ్బమ్మ వద్ద ఉంటున్నాడు. సోమవారం ఆమె పొలానికి వెళ్లిన సమయంలో విద్యుత్ షార్ట్ సర్కూ్యట్ అయి తాటాకు ఇంటికి మంటలు అంటుకుని గంగరాజు సజీవ దహనమయ్యాడు. గ్రామపెద్ద పర్ణం పెదబాబు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులతో కలిసి మంటలను అదుపు చేశారు.