డెంగీతో వ్యక్తి మృతి

3 Oct, 2016 21:55 IST|Sakshi
డెంగీతో వ్యక్తి మృతి
శాలిగౌరారం
శాలిగౌరారం గ్రామపంచాయతీ పరిధి శాలిలింగోటంలో డెంగీతో ఓ వ్యక్తి సోమవారం మృతి చెందాడు.  కుటింబీకులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. శాలిలింగోటం గ్రామానికి చెందిన కన్నెబోయిన అవిలయ్య(32) వ్యత్తిరీత్యా వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో  వారం రోజుల క్రితం తీవ్ర జ్వరం రావడంతో నకిరేకల్‌లోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌కు వెళ్లాడు. అక్కడ చికిత్స పొందిన అవిలయ్య మెరుగైన వైద్యచికిత్సల కోసం సూర్యాపేటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ నుంచి ఖమ్మం పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి  వెళ్లిన అవిలయ్య ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో అక్కడ నుండి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించగా డెంగీగా నిర్ధారించారు. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. మృతుడికి భార్య,  చిన్నారులైన ఇద్దరు కుమార్తెలు, కుమారునితో పాటు వృద్ధ వికలాంగులైన తల్లిదండ్రులు  ఉన్నారు.
రోడ్డునపడిన కుటుంబం:
శాలిలింగోటంలో డెంగ్యూతో మృతిచెందిన కన్నెబోయిన అవిలయ్య కుటుంబం ఆయన మృతితో రోడ్డునపడింది. చిన్న సన్నకారు రైతు కుటుంబానికి చెందిన అవిలయ్య తనకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వృద్ధాప్యంలో అంగవైకల్యంలో ఉన్న తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటూ కుటుంబానికి పెద్దదిక్కుగా మారిన ఒక్కగానొక్క కుమారుడు మృత్యువాత పడటంతో ఆ కుటుంబం రోడ్డునపడింది. తన కుమారుని మృతితో ఇంటివద్ద వారు రోదిస్తున్న తీరు అక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరనీ కంటతడి పెట్టించింది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. 
 
మరిన్ని వార్తలు