ప్రాణాన్ని బలిగొన్న ఓవర్‌టేక్‌

22 Feb, 2017 23:30 IST|Sakshi
ప్రాణాన్ని బలిగొన్న ఓవర్‌టేక్‌

ఎదురుగా దూసుకొచ్చిన రెండు వాహనాలు
దారిలేక బైక్‌ను రోడ్డు పక్కకు తిప్పిన యువకుడు
చెట్టు బలంగా తగలడంతో అక్కడికక్కడే మృతి
భార్య, కుమారుడికీ గాయాలు

ఆత్మకూరు : ఓవర్‌ టేక్‌ ఒక ప్రాణాన్ని బలిగొంది. మరో ఇద్దరిని గాయాలపాలు చేసింది. ఆత్మకూరు సమీపంలో బుధవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. రాయదుర్గం మండలం జుంజురాంపల్లికి చెందిన ఏకాంత్‌కుమార్‌ (35) తన భార్య సుశీలమ్మ, రెండేళ్ల కుమారుడితో కలిసి డ్రామా చూసేందుకని మంగళవారం అనంతపురంలోని బంధువుల ఇంటికి ద్విచక్రవాహనంలో వెళ్లాడు. బుధవారం తిరిగి స్వగ్రామానికి బయల్దేరాడు. ఆత్మకూరు మండల కేంద్రం సమీపానికి రాగానే ఎదురుగా రెండు వాహనాలు వచ్చాయి. ముందుకు పోవడానికి అవకాశం లేకపోవడంతో రోడ్డు పక్కకు తిప్పాడు.

అంతే అదుపుతప్పి చెట్ల పొదల్లోకి ద్విచక్రవాహనం వేగంగా దూసుకెళ్లింది. తలకు బలమైన గాయం కావడంతో ఏకాంత్‌కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న సుశీలమ్మకు తీవ్రగాయాలయ్యాయి. మధ్యలో కూర్చున్న కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన ప్రదేశం కళ్యాణదూరం రూరల్‌ పరిధి కావడంతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

>
మరిన్ని వార్తలు