రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

13 Aug, 2017 22:44 IST|Sakshi

ఇసుక అన్వేషణలో ఓ యువకుడు ప్రాణం కోల్పోయాడు. స్నేహితుడితో కలిసి బైక్‌లో బయల్దేరిన అతడిని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. ఆస్పత్రి వద్దకు చేరుకున్న తల్లి, చెల్లి గుండెలవిసేలా రోదించారు.

గుంతకల్లు రూరల్‌: కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురం జిల్లాకు చెందిన యువకుడు దుర్మరణం చెందాడు. ఇదే ప్రమాదంలో అతని స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంతకల్లుపట్ట ణంలోని హౌసింగ్‌బోర్డ్‌ కాలనీకి చెందిన శివ (22), అజయ్‌ స్నేహితులు. వీరిద్దరూ ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా వ్యాపారం చేసేవారు.

రెండు,మూడు రోజులుగా చెదురుమదురు వర్షౠలు కురుస్తుండటంతో ఇసుక ప్రాంతాలను గుర్తించేందుకు ఇద్దరూ ఆదివారం ఉదయాన్నే ద్విచక్రవాహనంపై గూళ్యం గ్రామానికి వెళ్లారు. కాసేపటి తర్వాత తిరుగుపయనమయ్యారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం అత్తిబెలగళ్‌ సమీపంలోకి రాగానే బైక్‌ నడుపుతున్న శివ కంట్లోకి ఏదో పడింది. దీంతో అదుపుతప్పి ముందు వెళుతున్న ఎద్దులబండిని వేగంగా ఢీకొన్నారు. శివ తీవ్రగాయాలతో అపస్మారకస్థితికి చేరుకోగా.. స్నేహితుడు అజయ్‌కు కాలు విరిగింది. క్షతగాత్రులిద్దరినీ స్థానికులు 108 వాహనంలో గుంతకల్లు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే శివ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అజయ్‌ చికిత్స పొందుతున్నాడు.

మరిన్ని వార్తలు