బంజారాహిల్స్: వేరొకరికి విక్రయించిన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడంతో పాటు ఫోర్జరీ డాక్యుమెంట్లతో స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నించిన వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నెం.10లోని ఇబ్రహీంనగర్లో నివాసం ఉండే బిపాషా, మహ్మద్ యూసుఫ్, మహ్మద్ ఉమర్, అస్రార్ బేగం, ఖాలెద్లు తమకున్న 100 గజాల స్థలంలోని ఇంటిని జూన్ లో మహ్మద్ రజాక్కు విక్రయించారు.
ఇందుకు ఆయన వారికి రూ.24.5 లక్షలు చెల్లించాడు. కొనుగోలు చేసిన పాత ఇంటిని కూల్చి కొత్తగా ఇంటిని నిర్మిస్తుండగా మహ్మద్ ఉమెర్ మిగిలిన కుటుంబ సభ్యులతో కలిసి దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించడంతో పాటు అడ్డుకున్న వారిని బెదిరించారు. దీంతో బాధితుడు రజాక్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులపై ఐపీసీ సెక్షన్ 452, 420, 427 రెడ్విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిందితుడు ఉమర్ను పోలీ సులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కాగా, ఉమర్, అతని కుటుంబసభ్యులు ఇదే విధంగా పలుచోట్ల అమాయకుల ఇళ్లను ఆక్రమించి కబ్జా చేస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.