సిబ్బంది లేక ఇబ్బంది

25 Sep, 2016 17:51 IST|Sakshi
సిబ్బంది లేక ఇబ్బంది
* తూనికలు, కొలతల శాఖ సిబ్బంది ఆవేదన
* మూడేళ్లుగా సిబ్బంది కొరతతో సతమతం
* అదనపు పనితో యాతన 
* పడుతున్నా స్పందించని ఉన్నతాధికారులు
 
గుంటూరు (లక్ష్మీపురం): జిల్లా తూనికలు కొలతలు శాఖ సిబ్బంది కొరతతో సతమతవుతోంది. గత మూడేళ్లుగా సమస్యతో ఇబ్బందులు పడుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని సిబ్బంది వాపోతున్నారు.  జిల్లా  తూనికలు కొలతల శాఖ కార్యాలయం పట్టాభిపురంలో  గత 10 సంవత్సరాలుగా అద్దె భవనంలో ఉంది.  శాఖలో మొత్తం ముగ్గురు జిల్లా ఇన్‌స్పెక్టర్లు, ఐదుగురు ఇన్‌స్పెక్టర్లు ఉండాలి. అయితే మూడేళ్లుగా ఇద్దరు జిల్లా ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఒక రీజినల్‌ డెప్యూటీ కంట్రోలర్‌ ఉండాలి. అయితే ఆ పోస్ట్‌లో కూడా వైజాగ్‌ రీజినల్‌ డెప్యూటీ కంట్రోలర్‌ పి.సుధాకర్‌ ఇన్‌చార్‌్జగా వ్యవహరిస్తున్నారు. 
 
అంతా ఆ నలుగురే...
ముగ్గురు జిల్లా ఇన్‌స్పెక్టర్లకు గాను ఇద్దరే విధులను నిర్వహిస్తున్నారు.  నరసరావుపేట రెగ్యులర్‌ జిల్లాఇన్‌స్పెక్టర్‌ అయిన దయాకర్‌రెడ్డి  గుంటూరు ఇన్‌చార్జ్‌  జిల్లా ఇన్‌స్పెక్టర్‌గాను, నరసరావుపేట ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్‌గాను విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే పురుషోత్తం తెనాలి జిల్లా ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అదే విధంగా నల్లబోతుల అలూరయ్య గుంటూరు రెగ్యులర్‌ ఇన్‌స్పెక్టర్‌ కాగా,సత్తెనపల్లి ఇన్‌చార్‌్జగా పనిచేస్తున్నారు.సయ్యద్‌ సలీం తెనాలి రెగ్యులర్‌ ఇన్‌స్పెక్టర్‌ కాగా, పొన్నూరు ఇన్‌చార్‌్జగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉన్న చౌక డిపోలు 2660లను వీరు నలుగురు స్టాంపింగ్‌ చేస్తూ నానా యాత న పడుతున్నారు.
 
పని భారంతో సతమతం..
తూనికలు కొలతలు శాఖ ఇన్‌స్పెక్టర్లు జిల్లా వ్యాప్తంగా చౌకడిపోలను ప్రత్యక్షంగా పరిశీ లించి ఈ పాస్‌ ఎలాక్ట్రానిక్‌ వేయింగ్‌ మిషన్‌ స్టాంపింగ్‌ చేయాల్సి ఉంటుంది. అలాగే చిల్లర దుకాణాలు, పెట్రోల్‌ బంకులు, లారీ వేయింగ్‌లను, యార్డులలో ఉండే కాటాలను ఇలాæ తూకం వేసే ప్రతి వ్యాపారంపై పూర్తి నిఘా ఉంచాల్సి వస్తుంది.  వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను సైతం పరిశీలించి దాడులు నిర్వహించాల్సి ఉంటుంది. వినియోగదారుడిని మోసం చేసేందుకు వ్యాపారస్తుడు కాటాలో తేడా చూపించినట్టు సమాచారం అందితే హుటాహుటిన వచ్చి పరిశీలించి కేసులు నమోదు చేసి కాటాలను సీజ్‌ చేసే అధికారం కూడా ఈ శాఖలో ఇన్‌స్పెక్టర్లకు ఉంటుంది. అయితే సిబ్బంది లేని కారణంగా ఎనిమిదిమంది చేయాల్సిన పనిని  నలుగురు మాత్రమే జిల్లాలో చేస్తున్నారు. ఈ కారణంగా తీవ్ర పనిఒత్తిడికి గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
సిబ్బంది కొరతపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం
జిల్లాలో మూడు సంవత్సరాలుగా సిబ్బంది కొరత ఉన్న విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లాం. ఉండవలసిన ఎనిమిది మంది మాత్రమే  కాకుండా మండలానికి ఓ ఇన్‌స్పెక్టర్‌ను  నియమించేందుకు ఉన్నతాధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.  అదేవిధంగా కార్యాలయంలో కంప్యూటర్లు కూడా 2జిబి ర్యాం ఉన్నవి మూడు మాత్రమే ఉన్నాయి.  4జిబి ర్యాం ఉన్న కంప్యూటర్లు ఎనిమిది వరకు కావాలి. ప్రతి ఇన్‌స్పెక్టర్‌కు ఓ కంప్యూటర్‌ను కేటాయించి, సిబ్బంది కొరత తీర్చి, సొంత భవనంలోకి కార్యాలయాన్ని బదిలీ చేస్తే ప్రజలకు మరింత చేరువ అవుతాము. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియచేశాం.
– ఎ.కృష్ణచైతన్య, జిల్లా అసిస్టెంట్‌ కంట్రోలర్‌
మరిన్ని వార్తలు