బుక్కరాయసముద్రం: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో భూ తగాదాలు భగ్గుమన్నాయి. సొంత చిన్నాన్ననే ఓ వ్యక్తి దారుణంగా హత్యచేశాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. వివరాలిలా ఉన్నాయి. బుక్కరాయసముద్రం మండల కేంద్రానికి చెందిన బసన్న (65)కు అతని అన్న కొడుకు వెంకటేష్తో భూ తగాదాలున్నాయి. ఎనిమిది ఎకరాల పొలానికి సంబంధించి మూడేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం వెంకటేష్, అతని భార్య ఎర్రమ్మ పొలాన్ని దున్నేందుకు ట్రాక్టర్ను తీసుకొని వెళ్లారు. రోజూ మాదిరిగానే బసన్న తన మనవడు వాసును ద్విచక్ర వాహనంలో ఎక్కించుకొని పొలాన్ని చూసేందుకు వెళ్లాడు. వివాదంలో ఉన్న పొలాన్ని ఎలా దున్నిస్తున్నావని వెంకటేష్ను ప్రశ్నించాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. వెంకటేష్ తన వెంట తెచ్చుకున్న వేటకొడవలితో బసన్నను నరికి చంపాడు. అనంతరం నేరుగా పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.