-
పాత పద్ధతిలోనే నిధుల కేటాయింపు జరగాలి
-
కేంద్రం మూడు నెలల్లో అమలు చేయాలి
-
లేకుంటే జాతీయస్థాయిలో ఉద్యమం
-
ఎమ్మెల్సీ యలమంచలి బాబూ రాజేంద్రప్రసాద్
ఖమ్మం మామిళ్లగూడెం: మండల, జెడ్పీలకు కేంద్రం 14వ ఆర్థిక సంఘం,కేంద్ర ప్రభుత్వ నిధులను పాత పద్ధతిలోనే కేటాయించాలని ఎమ్మెల్సీ యలమంచలి బాబూ రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు.ఆదివారం ఖమ్మం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రభుత్వాల సమస్యలపై,ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలైన పంచాయతీరాజ్ గ్రామస్థాయి ప్రజా ప్రతినిధుల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలన్నారు.
జాతీయ స్థాయిలో ఉద్యమం..
ఏపి, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సర్పంచ్లు, ఎంపిటిసీలు,జెడ్పీటీసీ,ఎంపీపీల సంఘాలకు చెందిన 50 మంది,రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో కేంద్రమంత్రులకు వినతి పత్రాలు అందజేసినట్లు వివరించారు. మూడు నెలల్లోగా కేంద్రం నిధుల కేటాయించక పోతే నవంబర్ నుంచి జాతీయస్థాయిలో ఉద్యమం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
‘చలో పార్లమెంట్’ నిర్వహణ
శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతి నిధుల ద్వారా ‘చలో పార్లమెంట్’ను నిర్వహిస్తామని చెప్పారు.సమావేశంలో తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి, గౌరవ అధ్యక్షుడు పుసులూరు నరేంద్ర, జిల్లా అధ్యక్షుడు బెల్లంకొండ శ్రీను పాల్గొన్నారు.