దొంగలను కిడ్నాప్ చేసిన మావోలు?

25 Aug, 2016 22:06 IST|Sakshi
ఖమ్మం జిల్లా చర్ల మండలం చినమిడిసిలేరు గ్రామానికి చెందిన కలప దొంగలను మావోయిస్టులు బుధవారం రాత్రి కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు రోజు మాదిరిగానే సమీప అటవీ ప్రాంతానికి వెళ్లి సరిహద్దు ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతం నుంచి టేకు కలపను నరికి.. దుంగలుగా చెక్కి తీసుకొచ్చి ఇక్కడి నుంచి మణుగూరు, బయ్యారం ప్రాంతాలకు తరలిస్తున్నారు.
 
ఈ క్రమంలో బుధవారం రాత్రి టేకు దిమ్మెలను తెచ్చేందుకు వెళ్లిన ఐదుగురు యువకులను సరిహద్దు ప్రాంతంలోని ఓ గ్రామ సమీపంలో మావోయిస్టు మిలీషియా సభ్యులుగా అనుమానిస్తున్న వ్యక్తులు.. వారిని అదుపులోకి తీసుకొని మావోయిస్టుల వద్దకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే గతంలో పలుమార్లు కలప స్మగ్లర్లను మావోయిస్టులు హెచ్చరించినట్లు తెలుస్తుండగా.. వారి మాటను పెడచెవిన పెడుతుండటంతోనే వీరిని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. అయితే కిడ్నాప్‌నకు గురైనట్లుగా భావిస్తున్న యువకుల కుటుంబ సభ్యులుగానీ, గ్రామస్తులుగానీ నోరుమెదపడం లేదు. దీనిపై వెంకటాపురం సీఐ సాయిరమణను సాక్షి’ వివరణ కోరగా.. ఈ విషయం తమ దృష్టికి రాలేదన్నారు. 
>
మరిన్ని వార్తలు