దారుణ హత్య

23 Sep, 2016 00:30 IST|Sakshi
హత్యకు గురైన కృష్ణయ్య మృతదేహం
  •  కట్టెల వ్యాపారిని హతమార్చిన దుండగులు
  •  పదునైన ఆయుధాలతో దాడి
  •  తాడూరు మండలం కుమ్మెరలో ఘటన
  • తాడూరు: గుర్తుతెలియన దుండగుల చేతిలో ఓ కట్టెల వ్యాపారి దారుణహత్యకు గురైన సంఘటన తాడూరు మండలం కుమ్మెరలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..  కుమ్మెర గ్రామానికి చెందిన మేకల కృష్ణయ్య (45)కట్టల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఉదయం 10.30గంటల సమయంలో ద్విచక్రవాహనంపై ఇంటినుంచి బయల్దేరి వెళ్లిన ఆయన గురువారం ఉదయం కుమ్మెరలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు ఎదురుగా ఉన్న పశువుల ఆస్పత్రి పరిసరాల్లో శవమై కనిపించాడు. ఉదయం ఆయా గ్రామాల నుంచి కుమ్మెర పాఠశాలకు వెళ్లే విద్యార్థులు కృష్ణయ్య మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని స్థానిక సర్పంచ్‌ మోహన్‌రెడ్డి, ఎంపీటీసీ గూళ్ల చెన్నయ్య, గ్రామస్తులకు తెలిపారు. దీంతో సర్పంచ్‌ పోలీసులకు విషయం చెప్పడంతో ఎస్‌ఐ వి.పురుషోత్తం తన సిబ్బందితో వెంటనే సంఘటన స్థలానికి వచ్చి హత్యకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. హతుడి ఎడమ చేయి వెనక, తల వెనక భాగంలో పదునైన ఆయుధంతో దాడి చేయడంతో బలమైన గాయాలు కనిపించాయి.
    కొద్దిదూరంలో ఉన్న రక్తపు మడుగు నుంచి మృతదేహాన్ని లాక్కెళ్లి ప్రహరీ గోడ మూలన పడేసినట్లు సంఘటనను బట్టి తెలుస్తోందని ఎస్‌ఐ పేర్కొన్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియలేదని, గ్రామస్తులు, సంబంధిత వ్యక్తులతో విచారించి దర్యాప్తు సాగిస్తామని ఆయన పేర్కొన్నాడు. మృతుడు కృష్ణయ్యకు భార్య బాలమ్మతో పాటు ముగ్గురు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగర్‌కర్నూల్‌ ఏరియా ఆస్పత్రికి తరలించి, భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
మరిన్ని వార్తలు