నిశ్చితార్థం అయ్యాక మోసం చేశారు

12 Jun, 2017 23:42 IST|Sakshi

నల్లూరు (రొద్దం) : నిశ్చితార్థం అయ్యాక ఆ అమ్మాయిని మరొకరికి ఇచ్చి వివాహం చేసి తమను మోసం చేశాడంటూ ఓ పెళ్లికుమారుడి తండ్రి పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశాడు. నిశ్చితార్థానికి అయిన ఖర్చును ఇప్పించాలంటున్నాడు. బాధితుడు తెలిపిన మేరకు.. రొద్దం మండలం నల్లూరు గ్రామానికి చెందిన వామన మూర్తి కుమారుడు రాఘవేంద్రరెడ్డికి కొత్తచెరువు మండలం ఓబుళదేవరపల్లికి చెందిన రవీంద్రారెడ్డి కుమార్తెతో ఈ ఏడాది మార్చి 8న నిశ్చితార్థం జరిగింది. అయితే తమకు తెలియకుండా రవీంద్రారెడ్డి తన కూతుర్ని మరో వ్యక్తికి ఇచ్చి వివాహం చేశాడని వామనమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిశ్చితార్థానికి రూ.11 లక్షలు ఖర్చు పెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈనెల 14న వివాహం జరగాల్సి ఉందని ఇప్పటికే పెళ్లికి సంబంధించిన అన్ని సరుకులు సిద్ధం చేసుకున్నట్లు వివరించారు. తాము ఖర్చు పెట్టిన డబ్బు తిరిగి ఇవ్వాలని పెళ్లి కూతురు కుటుంబ సభ్యులను అడిగితే తమను బెదిరిస్తున్నట్లు ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకుని, నిశ్చితార్థానికి ఖర్చుపెట్టిన రూ.11 లక్షలు వారి నుంచి తిరిగి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఇదిలా ఉండగా నిశ్చితార్థం జరిగిన కొన్ని రోజులకే ఆమె తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమించిన వ్యక్తితో వివాహం చేసుకున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు